Avinash Mohanty: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సైబర్ నేరాలు గణనీయంగా తగ్గాయని, ప్రజల్లో పెరిగిన అవగాహనే ఇందుకు ప్రధాన కారణమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. ఆయన 2025 వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఓవరాల్ క్రైమ్ రేట్లో పెద్దగా మార్పు లేదని, మొత్తం 37,243 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అయితే సైబర్ క్రైమ్ మాత్రం 35 నుండి 40 శాతం తగ్గిందని, బాధితులు కోల్పోయిన డబ్బు (Money Loss) రూ.793 కోట్ల నుంచి రూ.440 కోట్లకు తగ్గిందని వివరించారు. ముఖ్యంగా 117 డిజిటల్ అరెస్ట్ కేసుల్లో బాధితులకు రూ.96.76 లక్షలు తిరిగి ఇప్పించగలిగామన్నారు.
మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఈ ఏడాది 575 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి, 1,228 మందిని అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. నిందితుల నుంచి రూ.16.85 కోట్ల విలువైన 1,524 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇక ట్రాఫిక్ విషయానికి వస్తే.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గాయని (15,706 కేసులు), రూ.239 కోట్ల విలువైన చలాన్లు విధించామని చెప్పారు. బ్లాక్ స్పాట్లపై దృష్టి సారించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయని, ఈ ఏడాది ప్రమాదాల్లో 850 మంది మరణించారని పేర్కొన్నారు. ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ‘సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్’ విధానాన్ని, ట్రాఫిక్ మార్షల్స్ను అందుబాటులోకి తెచ్చామన్నారు.
మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ముమ్మరంగా పనిచేశాయని, 3,315 మందిని డెకాయ్ ఆపరేషన్లలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని సీపీ తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 2,298 మంది పిల్లలను రెస్క్యూ చేశామన్నారు. ఈ ఏడాది మిస్ వరల్డ్ ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు.
మీడియా అడిగిన ప్రశ్నలకు సీపీ సమాధానమిస్తూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడి ల్యాండ్ వివాదం కేసులో, గాచ్చిబౌలి సీఐ బదిలీలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. సీఐపై ఆరోపణలు వచ్చినందున, 10 రోజుల తర్వాత చర్యలు తీసుకున్నామన్నారు. సైబరాబాద్ పరిధిలో భూముల విలువ ఎక్కువ కాబట్టి లిటిగేషన్లు, సివిల్ వివాదాలు సహజమని, శాంతిభద్రతల సమస్య తలెత్తితే తప్ప పోలీసులు 99 శాతం సివిల్ మ్యాటర్లలో జోక్యం చేసుకోరని అవినాష్ మహంతి స్పష్టం చేశారు.
Read Also: Vemulawada Temple: వేములవాడ భీమేశ్వరాలయంలో ఉద్రిక్తత.. కారణం ఇదే..!