Dasoju Sravan: స్వేచ్ఛ బ్యూరో: ఎల్ నినోను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం బహిరంగలేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాలను దహించివేస్తున్న ‘సూపర్ ఎల్నినో’ రిజర్వాయర్లను ఖాళీ చేస్తూ ఖరీఫ్ సీజన్ను అతలాకుతలం చేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం సొంతంగా సృష్టించిన పాలనా శూన్యత వల్ల రాజధాని నగరం హైదరాబాద్ పౌర ప్రభుత్వం లేకుండా, సమన్వయం లేని ముక్కల పరిపాలనతో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపణలు..
రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన జలాశయాలు కడెం, నాగార్జున సాగర్, లోయర్ మానేరు, మూసి, నిజాంసాగర్, జూరాల, సింగూరు, శ్రీరాంసాగర్ ఈ నెల 9వ తేదీనికి కేవలం 44.5 టీఎంసీల నీటిని మాత్రమే కలిగి ఉన్నాయన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపంలో కేవలం ఒకే ఏడాదిలో 57 శాతం నీటి భద్రత పడిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద జలాశయం, హైదరాబాద్ నగరానికి జీవనాధారమైన నాగార్జున సాగర్ కేవలం 3.26 శాతం లైవ్ సామర్థ్యానికే పరిమితమైందని, పూర్తి సామర్థ్యం 180 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 6.53 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కంటింజెన్సీ పంటల ప్రణాళిక..
వర్షాలు ముఖం చాటేసినంకా సాగు సమయం దాటిపోయాక ఇప్పుడు జిల్లా యంత్రాంగం రైతులకు వరి సాగు వదిలేసి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమని చెబుతున్నాయని, ఇదే సూచన ఏప్రిల్ నెలల్లోనే ఇచ్చి ఉంటే రైతులు నష్టపోకుండా తమ సాగు నిర్ణయాలను మార్చుకునేవారు కదా అని నిలదీశారు. అంతా అయిపోయాక ఈనెల 15న ప్రభుత్వం తెచ్చిన ‘కంటింజెన్సీ పంటల ప్రణాళిక’ సమర్థవంతమైన పాలన అనిపించుకోదు, అది నష్టం జరిగాక చేసే బాధ్యతారరాహిత్యమైన మరమ్మత్తు మాత్రమే అన్నారు.
వర్షంతోనో, జలాశయాలతోనో సంబంధం లేని, పూర్తిగా ప్రభుత్వ ఆర్థిక నియంత్రణలో ఉన్న ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం పంపిణీలో ప్రభుత్వం ఘోరమైన జాప్యం చేసిందని, ఈ నిధుల కొరతే రైతులను సకాలంలో విత్తనాలు వేయకుండా నిలువరించి, సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసిందన్నారు. ఇది ప్రకృతి వైఫల్యం కాదు, ముమ్మాటికీ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం అని ఆరోపించారు.
Also Read: భోగాపురం ఎయిర్పోర్ట్పై సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్మెంట్.. రైతులకు అదిరిపోయే తీపి కబురు!