Annapurna Studios: హైదరాబాద్ లోని అన్నపూర్ణ కాలేజీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. ఏఎన్ఆర్ దార్శనికతను ప్రశంసించారు. తెలంగాణ సృజనాత్మక వృద్ధికి నాయకత్వం వహించాలని హీరో నాగార్జునను కోరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ ఫిలిం కాలేజీని సందర్శించారు. అన్నపూర్ణ కాలేజీ విద్యార్థుల సృజనాత్మకతను ప్రశంసించారు. 1970లో అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోను స్థాపించారని గుర్తుచేశారు. అప్పటి నుండి ఈ స్టూడియో హైదరాబాద్లోని అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక, సినిమా ల్యాండ్మార్క్లలో ఒకటిగా ఎలా ఎదిగిందో గుర్తుచేసుకున్నారు. అన్నపూర్ణ సంస్థ గొప్ప వారసత్వాన్ని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. అన్నపూర్ణ కళాశాలను ప్రపంచ స్థాయి చలనచిత్ర విద్యాబోధనతో ముందుకు తీసుకెళ్లడంలో అక్కినేని నాగార్జున, అమల పాత్ర ఎంతో ఉందన్నారు.
“అన్నపూర్ణ కళాశాల విద్యార్థులు రూపొందించిన రోల్ నంబర్ 52 చిత్రాన్ని నేను చూశాను. ఈ చిత్రం నా హృదయాన్ని తాకింది. ఇంత చక్కటి చిత్రాన్ని తీసిన దర్శకుడిని, మొత్తం బృందాన్ని నేను అభినందిస్తున్నాను” అని డిప్యూటీ సీఎం అన్నారు.
తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ఉద్దేశాలను హైలైట్ చేస్తూ, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ లక్ష్యంలో చిత్ర పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. చిత్ర పరిశ్రమ నుంచి చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి సీనియర్ సినీ దిగ్గజాల మద్దతు కోసం ఎదురుచూస్తున్నామన్నారు. అన్నపూర్ణ కళాశాల అసాధారణ ప్రతిభ గురించి అక్కినేని నాగార్జున స్వయంగా మాట్లాడారని, అది తనకు ఎంతో ప్రేరణనిచ్చిందన్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోస్ తన తండ్రి ఏఎన్ఆర్ తెలుగు చిత్ర పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్కు తరలించినప్పుడు నిర్మించారన్నారు. నేడు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో భారతదేశంలోని అత్యుత్తమ సంస్థలలో అన్నపూర్ణ ఒకటిగా నిలుస్తుందన్నారు. అన్నపూర్ణ కళాశాల భవిష్యత్ కథానాయకులను తీర్చిదిద్దుతోందన్నారు. డిప్యూటీ సీఎం అన్నపూర్ణ కాలేజీకి రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామన్నారు. ప్రపంచ సినిమాలో తెలంగాణ ముద్రకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామన్నారు.
Also Read: Bandi Sanjay: రేవంత్, కేటీఆర్ ఫ్రెండ్సా? బండి సంజయ్ సెల్ఫ్ గోల్?
తెలంగాణను చలనచిత్ర నిర్మాణం, మీడియా, ఆవిష్కరణ, సృజనాత్మకతకు ప్రపంచ కేంద్రంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వ మద్దతు ఇస్తుందన్నారు. డిప్యూటీ సీఎం అన్నపూర్ణ స్టూడియోస్, ఏఎన్ఆర్ సౌండ్ & విజన్, భారతదేశంలోని మొట్టమొదటి డాల్బీ ఫెసిలిటీ సినిమాను సందర్శించారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతికతను మెచ్చుకున్నారు.