DGP Shivadhar Reddy: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) శివధర్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు కీలక విజ్ఞప్తి చేశారు. హింసా మార్గాన్ని విడిచిపెట్టి, జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు. గత రెండేళ్ల కాలంలో సుమారు 721 మంది మావోయిస్టు కేడర్ పోలీసుల ముందు లొంగిపోయారని, వారందరికీ ప్రభుత్వ పునరావాస పథకం కింద రావలసిన అన్ని ప్రయోజనాలను అందించి, వారు గౌరవప్రదమైన జీవితం గడిపేలా చర్యలు తీసుకున్నామని డీజీపీ వివరించారు. తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానంపై ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేడర్లో కూడా నమ్మకం పెరుగుతోందని, అందుకే లొంగిబాట పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల్లో అజ్ఞాతంగా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ముఖ్య నాయకుల పేర్లను డీజీపీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. జగిత్యాల జిల్లాకు చెందిన మాజీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఆయన భార్య గద్వాల్కు చెందిన జోడే రత్నబాయి అలియాస్ సుజాత, హనుమకొండకు చెందిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్, సికింద్రాబాద్కు చెందిన వర్త శేఖర్ అలియాస్ మంగ్తు, హైదరాబాద్కు చెందిన నక్క సుశీల అలియాస్ రేలా, సిద్దిపేట జిల్లాకు చెందిన రంగబోయిన భాగ్య అలియాస్ రూపి వంటి వారు వెంటనే ఆయుధాలు వీడి సమాజంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి) ప్రస్తుతం వయోభారం, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తమకు సమాచారం ఉందని డీజీపీ వెల్లడించారు. ఆయన జనజీవన స్రవంతిలోకి తిరిగి వస్తే, ప్రభుత్వం తరఫున ఆయనకు మెరుగైన, తగిన వైద్య సదుపాయాలు అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అజ్ఞాతంలో ఉంటూ అనారోగ్యంతో ఇబ్బంది పడటం కంటే, కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని ఆయన సూచించారు. మావోయిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీజీపీ కోరారు.
భారత్ లో మావోయిస్టుల లొంగిబాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు (ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర) గడువును మార్చి 31గా నిర్ణయించాయి. మార్చి 31 లోపు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రాని పక్షంలో, ఏప్రిల్ 1 నుండి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీ ఎత్తున తుది విడత ఆపరేషన్లు నిర్వహించాలని భద్రతా దళాలు నిర్ణయించాయి.
Read Also: రావణాసురుడితోనే రాముడికి పేరు.. కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి