Childhood Obesity: ఒకప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు పిల్లలకు అన్నం తినిపించాలంటే ఆకాశంలోని చందమామను చూపించేవారు. ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అంటూ పాటలు పాడుతూ, కబుర్లు చెబుతూ పిల్లలకు గోరుముద్దలు పెట్టేవారు. ఆ ముద్దలో కేవలం అన్నం మాత్రమే కాదు, కుటుంబ సభ్యుల ప్రేమ, ప్రకృతితో అనుబంధం కూడా ఉండేవి. కానీ, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆ చందమామ స్థానాన్ని స్మార్ట్ఫోన్ ఆక్రమించేసింది.
పిల్లలు మారాం చేసినా, ఏడ్చినా లేదంటే త్వరగా అన్నం తినాలన్నా.. నేటితరం తల్లులకు ఫోన్ ఒక్కటే సులభమైన మార్గంగా కనిపిస్తోంది. యూట్యూబ్లో రైమ్స్ లేదా కార్టూన్లు పెట్టి ఫోన్ను చేతిలో ఇస్తే, పిల్లాడు లోకాన్ని మర్చిపోయి మెకానికల్గా నోరు తెరుస్తాడు. పని త్వరగా అయిపోతుందని తల్లులు సంబరపడుతుంటారు కానీ, ఇక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. ఇలా ఫోన్ చూస్తూ తినడాన్ని ‘డిజిటల్ ఫీడింగ్’ అంటారు. ఇది పిల్లల పాలిట సైలెంట్ కిల్లర్గా మారుతోంది. ఇండియాలో చిన్నారులు ఊబకాయం బారిన పడటానికి ఈ అలవాటే ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చిన్న వయసులోనే స్మార్ట్ఫోన్లకు బానిసవ్వడం వల్ల ఐదేళ్ల లోపు పిల్లల్లో కూడా బరువు పెరగడం కనిపిస్తోంది. ఇటీవల గుజరాత్లో చేసిన ఒక సర్వే ప్రకారం.. రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సమయం స్క్రీన్ల ముందు గడిపే పిల్లల్లో 43 శాతం మంది ఊబకాయం బారిన పడుతున్నారు. కేవలం బరువు పెరగడమే కాకుండా.. శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎముకలు బలహీనపడటం, విటమిన్ డి లోపం, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు చిన్నారి ప్రాయంలోనే చుట్టుముడుతున్నాయి. అంతేకాదు, స్మార్ట్ఫోన్ వాడకం వల్ల నిద్ర సరిగ్గా లేక, అది మెదడుపై ప్రభావం చూపి ఏకాగ్రతను కూడా దెబ్బతీస్తోంది.
Also Read: విటమిన్ C లోపంతో బాధపడుతున్నారా? ఈ పండ్లు, కూరగాయలతో ఈజీగా చెక్ పెట్టండి!
మనం సినిమా చూస్తూ పాప్కార్న్ తిన్నప్పుడు ఎంత తింటున్నామో మనకే తెలియదు. పిల్లల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఫోన్ చూస్తూ తినడం వల్ల మెదడుకు ఆహారం రుచి, వాసన తెలియదు. కడుపు నిండిందనే సంకేతాన్ని మెదడు గుర్తించదు. దీనివల్ల పిల్లలు తమకు అవసరమైన దానికంటే ఎక్కువే తినేస్తున్నారు. పైగా గంటల తరబడి ఫోన్ చూడటం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని, జంక్ ఫుడ్ మీద క్రేవింగ్స్ పెరుగుతాయి. ఇది చివరకు టైప్-2 డయాబెటిస్, రక్తపోటు వంటి ముప్పులకు దారితీస్తుంది.
పిల్లలను స్మార్ట్ఫోన్ నుంచి దూరం చేయాలంటే ముందు తల్లిదండ్రులు మారాలి. మనం ఫోన్ చూస్తూ వారిని వద్దంటే వినరు. భోజనం చేసేటప్పుడు ఫోన్లు, టీవీలు ఆఫ్ చేసి కుటుంబంతో కలిసి సమయం గడపాలి. పిల్లలకు ఆహారపు రుచులను పరిచయం చేయాలి. వారిని ఆరుబయట ఆటలకు ప్రోత్సహించాలి. ఒక్కసారి ఈ అలవాటు మార్చుకుంటే, కొద్ది నెలల్లోనే వారి ఆరోగ్యంలో ఆశ్చర్యకరమైన మార్పులను గమనించవచ్చు. పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి మనం రిలాక్స్ అవ్వడం కంటే.. వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం కాస్త సమయం కేటాయించడం చాలా ముఖ్యం.
Also Read: ఈ వంటకాలను డైట్లో చేర్చుకుంటే.. షుగర్ ఉన్నవాళ్లు ఇన్సులిన్ వాడాల్సిన పనిలేదు!