Lionel Messi Football Match: హైదరాబాద్లో ఫుట్బాల్ అభిమానులకు నేడు చారిత్రాత్మక ఘట్టం ఏర్పడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో.. భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం నుంచి డీజీపీ శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలను వెల్లడించారు.
మెస్సీ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాజాగా కోల్కత్తాలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. ఆ ఘటనలో చోటుచేసుకున్న లోపాలను పూర్తిగా అధ్యయనం చేసి, అలాంటి పరిస్థితులు హైదరాబాద్లో పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. కోల్కత్తాలో రోప్ పార్టీలు లేకపోవడం వల్లే ఘటన జరిగిందన్న సమాచారం తమకు అందిందని, అందుకే ఉప్పల్ స్టేడియంలో అలాంటి లోపాలు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని వెల్లడించారు.
ఉప్పల్ స్టేడియంలో మొత్తం 20 రోప్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. అభిమానులు గ్రౌండ్లోకి దూసుకెళ్లకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. స్టేడియం లోపల, బయట, ప్రవేశ ద్వారాలు, వీఐపీ గ్యాలరీలు, మీడియా ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పూర్తి అప్రమత్తతతో పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఇదే సమయంలో, ఈ సాయంత్రం 4:30 గంటలకు లియోనెల్ మెస్సి హైదరాబాద్కు చేరుకోనున్నారు. కోల్కత్తా నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన రానున్నట్లు అధికారులు వెల్లడించారు. మెస్సీ రాక సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి ఉప్పల్ స్టేడియం వరకు మార్గమంతా ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు.
మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న అనంతరం ఆయనతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడనున్నట్లు సమాచారం. అంతేకాకుండా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మెస్సీకి ఘన స్వాగతం పలకనున్నారు.
రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి.. మెస్సి ఫుట్బాల్ ఆడనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
మెస్సీ 7 గంటల నుంచి 7:15 గంటల వరకు మైదానంలో ఫుట్బాల్ ఆడతారు. ఇది పూర్తి స్థాయి మ్యాచ్ కాదని, కేవలం ప్రదర్శనాత్మకంగా నిర్వహించే ఫ్రెండ్లీ సెషన్ మాత్రమేనని స్పష్టం చేశారు. చివరి 5 నిమిషాల పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడతారని తెలిపారు.
అనంతరం 7:30 గంటల నుంచి సుమారు 20 నిమిషాల పాటు చిన్న పిల్లలకు మెస్సి స్వయంగా ఫుట్బాల్ టెక్నిక్స్, ప్రాథమిక నైపుణ్యాలు నేర్పించనున్నారు. యువత, బాలలలో క్రీడాపై ఆసక్తి పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మెస్సీని సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించనున్నారు.
ఇక స్టేడియం మైదానంలో మెస్సి సుమారు 10 నిమిషాల పాటు ఒక రౌండ్ పర్యటిస్తూ.. అభిమానులకు అభివాదం చేయనున్నారని డీజీపీ తెలిపారు. అయితే ఇది పూర్తి మ్యాచ్ కాదని, కేవలం ప్రత్యేక కార్యక్రమం మాత్రమేనని మరోసారి స్పష్టం చేశారు.
భద్రతా పరంగా కీలక సూచనలు కూడా జారీ చేశారు. స్టేడియం వద్ద ఎలాంటి టికెట్ అమ్మకాలు జరగవని, టికెట్లు ఉన్నవారు మాత్రమే స్టేడియం పరిసరాలకు రావాలని తెలిపారు. సాధారణ అభిమానులు ఎవరూ స్టేడియం వద్దకు రావద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్టేడియం లోపల ఫోటోలు, సెల్ఫీలు తీసుకునే అవకాశం లేదని, ఎవరూ అటువంటి ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు.
డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. అభిమానులు పోలీసులకు సహకరించాలని, భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. స్టేడియంలోకి నిషేధిత వస్తువులు తీసుకురావద్దని, భద్రతా తనిఖీలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: 70 అడుగుల మెస్సీ విగ్రహం ఆవిష్కరణ, స్టేడియం దగ్గర ఉద్రిక్తత..వాటర్ బాటిల్స్ విసిరిన ఫ్యాన్స్
మెస్సీ రాకతో హైదరాబాద్లో క్రీడా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అదే సమయంలో, భద్రతా పరంగా ప్రభుత్వం, పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో నగరం మొత్తం హై అలర్ట్లో ఉంది.