Dharmapuri Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జిల్లా ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టిందని ఆయన ఆరోపించారు.
నిజామాబాద్ జిల్లాకు మొండిచేయి
సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని, టోటల్గా పంగనామాలు పెట్టారని అరవింద్ మండిపడ్డారు. సొంత పార్టీకి చెందిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను రాజకీయంగా అణగదొక్కేందుకే జిల్లాకు నిధులు ఇవ్వకుండా మొండిచేయి చూపించారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో మహేష్ కుమార్ గౌడ్ ఏ మొఖం పెట్టుకుని జిల్లాలో తిరుగుతున్నారని ప్రశ్నించారు. గతంలో నిజామాబాద్కు అవుటర్ రింగ్ రోడ్ (ORR) ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కారని, ఇందూరు ప్రజలను మోసం చేస్తే రాబోయే రోజుల్లో వారే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. దేవుళ్లకే అబద్ధాలు చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డికి, ప్రజలను మోసం చేయడం ఒక లెక్కా అని దుయ్యబట్టారు.
నగర డ్రైనేజీ పనులపై నిర్లక్ష్యం
కాంగ్రెస్ హయాంలో నిజామాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎప్పటికీ పూర్తికావని ఎంపీ స్పష్టం చేశారు. ఇప్పటివరకు కనీసం 25 శాతం పనులు కూడా జరగలేదన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ. 162 కోట్లు అవసరమైతే, ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (UDC) కి కేవలం రూ. 10 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం మార్పు డిమాండ్
రాహుల్ గాంధీ 2039 వరకు ప్రధాని కాలేరంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అరవింద్ ప్రస్తావించారు. అంటే రాహుల్ గాంధీ ఇక ఎప్పటికీ ప్రధాని కాలేరని, మరో పదేళ్లపాటు దేశంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మార్కు రాజకీయాలు నడవవని, ఆయన స్థానంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి జన్యూన్ వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.
ఇక బుల్లెట్ రైల్ కారిడార్ విషయంలో సీఎం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉన్న పట్టణాన్నే సరిగ్గా అప్గ్రేడ్ చేయలేకపోయిన కేసీఆర్నే ఇక్కడి ప్రజలు నమ్మలేదని.. అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్న లేని ‘ఫ్యూచర్ సిటీ’ని జనాలు ఎలా నమ్ముతారని అరవింద్ ప్రశ్నించారు.
Also Read: కాంగ్రెస్లో కొత్త మండల కమిటీలు.. వారికి మాత్రమే అవకాశం?