DISHA Meeting: స్వేచ్ఛ బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశా సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్షను ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘు రామ్ రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్లు నిర్వహించారు. బుధవారం కొత్తగూడెం ఐడీఓసీలో ఎంపీ రామ సహాయం రఘు రామ్ రెడ్డి అధ్యక్షత వహించగా, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ కో – చైర్మన్గా వ్యవహరించారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, కొత్తగూడెం మున్సిపల్ మేయర్ మూడ్ గణేష్లు మాట్లాడుతూ.. తాగునీరు, వైద్యం, మౌలిక వసతులపై గత దిశా కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, వివిధ శాఖల అభివృద్ధి పనుల పురోగతి సమగ్రంగా సమీక్షించారు.
ఎంపీ రామ సహాయం రఘు రామ్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని, ప్రతి శాఖ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పనుల పురోగతిని నివేదికల రూపంలో ఎప్పటికప్పుడు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకమని, ప్రతి పథకం లక్ష్యాలకు అనుగుణంగా లబ్ధిదారులకు సమయానికి ప్రయోజనాలు చేరేలా పర్యవేక్షణలో వేగం పెంచాలన్నారు. వేసవి కాలంలో తాగునీటి సరఫరా, వైద్య సేవలు, విద్యుత్ వంటి ప్రాథమిక సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఉపాధి హామీ పథకం లోగతంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇచ్చేదని, ఇప్పుడు కేవలం 60 శాతం మాత్రమే ఇచ్చే విధంగా మార్పు చేసి, మిగిలిన 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా మార్చారని తెలిపారు. గృహ నిర్మాణ శాఖలో కూడా పలు మార్పులు చేయడం వల్ల పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.
Also Read: రాష్ట్రంలో ఈవీ బస్సుల విప్లవం.. ఏసీ ఎలక్ట్రిక్ బస్సులే లక్ష్యంగా ఆర్టీసీలో మార్పులు: సీఎం చంద్రబాబు
ఈ సమస్యల పరిష్కారం కోసం సమగ్ర చర్చ జరిగిందని తెలిపారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ జాతీయ రహదారులు, ఆర్ & బి, విద్యుత్ శాఖల పనుల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐటీడీఎ నిధులతో చేపట్టిన పనులలో ఆలస్యానికి కారణాలను వివరించాలని అధికారులు నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ఇల్లందు, మణుగూరు ,భద్రాచలం, కొత్తగూడెం తదితర ప్రాంతాల ప్రభుత్వ ఆసుపత్రుల పరిశుభ్రత, ఆహార నాణ్యత, మరుగుదొడ్ల నిర్వహణ, అంబులెన్స్, డయాలసిస్ సేవల విస్తరణ, సికిల్ సెల్ అనీమియా పట్ల అవగాహన కార్యక్రమాలపై అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. మిషన్ భగీరథ, అమృత్ పథకాల కింద తాగునీటి సరఫరా, పైప్లైన్లీకేజీలను తొలగించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీలలో త్రాగునీటి సరఫరా పనులను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు.
మహబూబాబాద్ ఎం.పీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు తదితరులు తమ నియోజకవర్గాల్లో పథకాల అమలు స్థితిగతులపై అధికారుల నుంచి సవివర నివేదికలు కోరారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, దిశా కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు హాజరై అభివృద్ధి పనులను నివేదించారు. ఇల్లందు మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, అశ్వరావుపేట మున్సిపల్ చైర్ పర్సన్ శశికళ, డి ఆర్ డి ఓ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు, దిశా కమిటీ సభ్యులు బుర్ర సురేష్, యేసుమని, స్వర్ణ , ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Also Read: రాష్ట్రానికి మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ రెడ్డితో టిమ్ రైఫిల్ భేటీ