Child Protection: స్వేచ్ఛ బ్యూరో: పిల్లలకు పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు, మంచి–చెడుల మధ్య తేడాను తెలియజేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు ప్రతి ఒక్కరి పై ఉందని జిల్లా సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ (DLSA) చైర్మన్ బాల భాస్కర్ రావు అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన చైల్డ్ ప్రొటెక్షన్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బాల భాస్కర్ రావు మాట్లాడుతూ..
ఈ సందర్భంగా బాల భాస్కర్ రావు మాట్లాడుతూ 18 ఏళ్లలోపు వారందరూ చట్టపరంగా బాలలేనని, పిల్లలపై జరుగుతున్న వేధింపులు, దాడులు వంటి అంశాలపై వారు ధైర్యంగా మాట్లాడేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. సెల్ఫోన్, డిజిటల్ మీడియా వినియోగం, డ్రగ్స్ ప్రభావంపై నిరంతరం నిఘా ఉంచి పిల్లలను సరైన మార్గంలో నడిపించాలని అన్నారు.
పాఠశాలల్తో జరిగే తప్పులు దాచిపెడితే జైలుకు..
పాఠశాలల్లో జరిగే లైంగిక వేధింపులు లేదా ఇతర అసభ్యకర ఘటనలను దాచిపెట్టకుండా వెంటనే పోలీసులకు, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని, పాఠశాల ప్రతిష్ఠ పేరుతో రాజీ ప్రయత్నాలు చేస్తే యాజమాన్యం కూడా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోక్సో చట్టం, జువైనల్ జస్టిస్ చట్టం, బాల కార్మిక నిరోధక చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ)పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ నిరుపేదలు, అణగారిన వర్గాలకు జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా సంస్థల ద్వారా ఉచిత న్యాయ సేవలు అందుతున్నాయని తెలిపారు.
అధికారులకు చట్టాలపై పూర్తి అవగాహన..
చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు చట్టాలపై పూర్తి అవగాహన ఉండాలని, ఈ సదస్సులో న్యాయ నిపుణులు అందించే సూచనలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లలకు మంచి విషయాలతో పాటు చెడు ప్రభావాలపై కూడా అవగాహన కల్పించి, సంబంధిత శాఖల సమన్వయంతో బాలల భద్రతకు అనుకూల వాతావరణాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నయ్య, కూషాయిగూడ ఏసీపీ చక్రపాణి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: ప్రధాని మోదీ పోస్టుల వివాదం.. డీసీపీ అరవింద్ బాబుపై వేటు!