బీఆర్ఎస్కు కంచుకోటగా పిలవబడే సిద్దిపేటపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అధికార పార్టీ చూస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అతనికి మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల సిద్ధిపేట నియోజకవర్గంలోని నర్మెట్టలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి పై ప్రకటన చేశారు.ప్రస్తుతం దానిపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సవాళ్ల పర్వం కొనసాగుతోంది. హరీశ్ రావును వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతామని, మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. అయితే, రెండ్రోజుల కిందట రేవంత్ రెడ్డి సవాల్ను హరీశ్ రావు స్వీకరించారు.
సిద్ధిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తామని సీఎం రేవంత్ చెప్పే బదులు.. ఆయనే ఇక్కడకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్ రావు సవాల్ విసిరారు. అప్పుడు ఎవరి సత్తా ఎంటో తేలిపోతుందని అన్నారు. రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ లేదని, కాంగ్రెస్ పార్టీ సైతం అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని హరీశ్ రావు స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని, గులాబీ బాస్ కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని స్పష్టంచేశారు. కాగా, హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఘాటుగా స్పందించారు. హరీశ్ రావును ఓడించడానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అవసరం లేదని వారు పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామని ముందే ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. చెప్పింది చేసి చూపించారని గుర్తుచేస్తున్నారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలతో దూసుకుపోతుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు ఇలాగే కొనసాగుతుందని, సిద్ధిపేటలో హరీశ్ రావును ఓడించేందుకు ప్రజలు ఆలోచించాలని.. మార్పు జరిగితేనే అభివృద్ధి సాధ్యమని సీఎం రేవంత్ చెప్పిన వ్యాఖ్యలను గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే వేముల వీరేశం గుర్తుచేశారు. హరీశ్ రావును ఓడించిన వ్యక్తికి మంత్రి పదవి వస్తుందని, తద్వారా జిల్లా సుభిక్షంగా ఉంటుందని వారు చెబుతున్నారు.
Gas Booking: వాట్సాప్ లో LPG గ్యాస్ బుకింగ్.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే!
గత పదేండ్లలో మాజీ మంత్రి హరీశ్ రావు తన సొంత నియోజకవర్గం సిద్దిపేటలో చేసిందేమీ లేదని, ఆయన నీటి పారుదలశాఖ మంత్రిగా ఉన్న సమయంలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని, అందుకు కాళేశ్వరం ఏటీఎంలా వాడుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఆయన చేసిన అభివృద్ది కంటే అక్రమాలు అధికంగా ఉన్నాయని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి సీఎం రేవంత్కు వ్యతిరేకంగా నిలబడే స్థాయి కాదని కాంగ్రెస్ సీనియర్లు అంటున్నారు. సీఎం రేవంత్ ఒంటరిగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం అహర్నిషలు కృషి చేశారని.. ఆయన మాస్ లీడర్ షిప్ వల్లే బీఆర్ఎస్ అధికారానికి దూరం అయ్యిందని, ఈ విషయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అంగీకరించాల్సి ఉందని వెల్లడించారు.గల్లీ లీడర్ను సిద్ధిపేటలో హరీశ్ రావుకు వ్యతిరేకంగా నిలబెట్టి అతన్ని గెలిపించే సత్తా రేవంత్కు ఉందని చెబుతున్నారు. ఈ విషయంపై మరోమారు హరీశ్ రావు సవాల్ విసరడం మానుకోవాలని హితవు పలికారు.