Fertility Centre Case: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్గూడ జైలు నుంచి నమ్రతను గాంధీ హాస్పిటల్కు తరలిచారు. వైద్య పరీక్షల అనంతరం గోపాలపురం పోలీస్స్టేషన్కు ఆమెను తీసుకెళ్లనున్నారు. ఐదు రోజుల పాటు కస్టడీలో నమ్రతను పోలీసులు విచారించనున్నారు. ఇతర నిందితులు జయంత్ కృష్ణ, ధనసరి సంతోషిని కస్టడీ కోసం కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
సృష్టి నిందితుల రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు
సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో అక్రమాలకు పాల్పడిన డాక్టర్ నమ్రతను 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. సరోగసీ చేయకున్నా చేసినట్లుగా నమ్మించి పలువురు దంపతులను మోసం చేసినట్లు డాక్టర్ నమ్రత అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సరోగసీ విధానం అమలు కోసం కీలకంగా పనిచేసింది A3 నిందితురాలు కల్యాణి ఆచ్చయమ్మ సృష్టి సెంటర్లో ANM నర్సుగా ఎంట్రీ ఇచ్చింది. విశాఖపట్నం బ్రాంచ్లో అడ్మినిస్ట్రేటివ్, ఇన్ఛార్జ్గా ఉంది. సృష్టి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, భువనేశ్వర్, కోల్కత్తాలో కూడా బ్రాంచ్లను కలిగి ఉంది.
ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో డాక్టర్ నమ్రత దారుణాలు
జస్థాన్ దంపతులు డీఎన్ఏ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని నమ్రత తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని రోజుల సమయం ఇస్తే తప్పును సరిదిద్దుతామని వారికి నచ్చచెప్పి చూశారన్నారు. అయితే, వాళ్లు వినకపోవడంతో తన కుమారుడితో రాజస్థాన్ దంపతుల్ని బెదిరించారు.
నిందితులను కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు బయటపడే ఛాన్స్
సృష్టి సెంటర్ సరోగసీ పేరుతో అనేక మోసాలకు పాల్పడిందని, ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు వసూలు చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మోసాలకు ఏపీలోని కొందరు ఏఎన్ఎంల సహాయం కూడా తీసుకున్నారని, గాంధీ ఆస్పత్రి అనస్థీషియన్ డాక్టర్ సదానందం వీరికి పూర్తిస్థాయిలో సహకరించారని నమ్రత అంగీకరించారు.
కీలకంగా పనిచేసిన A3 కల్యాణి ఆచ్చయమ్మ
A1 నిందితురాలు డాక్టర్ నమ్రతతో, A3 కల్యాణి కలిసి… సరోగసీ విధానంలో పిల్లలు పుడతారంటూ… తప్పుడు ప్రచారాలు చేసిందని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సృష్టి సెంటర్ ఏజెంట్స్ నుంచి పిల్లలను సేకరించి.. సరోగసీ ద్వారా పుట్టారంటూ క్లయింట్స్కు అప్పగిస్తుందని బయటపడింది. సరోగసీ ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మును.. కల్యాణికి వాటాలు అప్పగిస్తూ ఉండేదని పేర్కొన్నారు. కల్యాణి సహకారంతో వచ్చే దంపతులను మాయ చేసి, బిడ్డలను అప్పగిస్తూ ఉండేవారని విచారణలో తేలింది. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
Also Read: బస్సులో చోరీ.. రూ.4 లక్షలు, 4 కేజీల వెండితో దొంగలు పరార్
నవజాత శిశువులను కొంటున్న బ్యాంకు ట్రాన్సాక్షన్స్ గుర్తింపు
ఈ కేసులో 39మంది సాక్షులను రిపోర్టులో జోడించారు పోలీసులు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ సోదాల్లో కూడా 2.37లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కల్యాణిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే.. మరిన్ని విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో.. పేషేంట్స్కు సంబంధించిన వందల కేసు షీట్స్, రికార్డ్స్ను స్వాధీనం చేసుకున్నారు. నవజాత శిశువులను కొంటున్నా బ్యాంకు ట్రాన్సాక్షన్స్ను కూడా పోలీసులు గుర్తించారు.