Earthquake: వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో గురువారం రాత్రి భూమి కంపించటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక సెకను కాలంపాటు ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. ఊహించని ఈ ఘటనతో ప్రజలు ఇళ్లను వీడి బయటకు పరుగులు తీశారు. ప్రాణభయంతో వణికిపోయిన గ్రామస్థులు, ఏం జరిగిందో అర్థం కాక ఆందోళన చెందారు.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్కసారిగా భూమి కంపించడం ప్రారంభించింది. ఇంట్లోని వస్తువులు కదిలాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి అనుభవం లేకపోవడంతో.. వృద్ధులు, పిల్లలు ఉలిక్కిపడ్డారు. చాలాసేపు ప్రజలు ఇళ్లలోకి వెళ్లడానికి సాహసించలేదు. భూమి కంపించిన విషయం స్థానికంగా ఉన్న ఇతర గ్రామాలకు త్వరగా వ్యాపించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు సైతం ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. కొద్దిసేపటి తర్వాత ప్రకంపనలు ఆగిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎవరూ గాయపడలేదు.
భూ ప్రకంపనల సమాచారం అందుకున్న వెంటనే జిల్లా విపత్తు నిర్వహణ బృందం అప్రమత్తమైంది. తహసీల్దార్, పోలీసులు రాకంచెర్లకు చేరుకున్నట్టు సమాచారం. భూమి కంపించడానికి గల కారణాలను తెలుసుకోవడానికి జియోలాజికల్ సర్వే బృందాలు త్వరలో రాకంచెర్ల ప్రాంతాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.. ఈ పరిశోధనల నివేదిక అనంతరం ప్రకంపనల అసలు కారణం తెలియనుంది. భూకంపాలు సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు అధికారుల బృందం గ్రామస్థులకు వివరించింది.
ALSO READ: Telangana Govt: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. 148.11 ఎకరాల భూమిని రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్గా ప్రకటన