Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం అటవీ సంరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల జిల్లాలో 148.11 ఎకరాల విస్తీర్ణాన్ని రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్గా ప్రకటించింది. కాలేశ్వరం సర్కిల్, మంచిర్యాల రేంజ్ పరిధిలో ఈ అటవీ బ్లాక్ను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 ప్రకారం ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. అడవుల ముఖ్య సంరక్షణాధికారి (ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్) సమర్పించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రిజర్వ్ బ్లాక్ ఏర్పాటు ఉద్దేశం.. అటవీ భూములను పరిరక్షించడం, పర్యావరణ సమతుల్యత కాపాడటం.
ఈ రిజర్వ్ ఫారెస్ట్ మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలంలోని పలు సర్వే నంబర్లలో విస్తరించి ఉంది. సర్వే నంబర్లు 178, 397, 193, 819 పరిధిలో ఈ అడవిని రిజర్వ్ చేస్తున్నారు. మొత్తం 148.11 ఎకరాల భూమిని పూర్తిస్థాయిలో అడవి బ్లాక్గా తీర్చిదిద్దనున్నారు. దీనికి అదనంగా.. మంచిర్యాల జిల్లా పెగడపల్లీ గ్రామంలో కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ బ్లాక్ ఏర్పాటు చేయనున్నారు. ఈ బ్లాక్ సుమారు 60 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు.. అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు ఈ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ కార్యక్రమం దోహదపడుతుంది.
ఈ నోటిఫికేషన్ను డిసెంబర్ 4వ తేదీన ప్రత్యేక గెజిట్లో ప్రచురించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ప్రింటింగ్ విభాగం ఈ గెజిట్ నోటిఫికేషన్ 200 కాపీలను ఫారెస్ట్ శాఖకు తక్షణమే సరఫరా చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మొత్తం ప్రక్రియ సజావుగా జరిగేందుకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ముఖ్యపాత్ర వహిస్తారు. కలెక్టర్ గెజిట్లో నోటిఫికేషన్ ప్రచురించి.. తదుపరి చర్యలు వేగంగా తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అటవీ సంరక్షణ ప్రయత్నాలలో మహత్తర ఘట్టంగా నిలుస్తుంది. ఇది రాష్ట్రంలో పచ్చదనం పెంచే లక్ష్యానికి బలం చేకూరుస్తుంది. అటవీ భూములు ఇతర అవసరాలకు మళ్ళించకుండా శాశ్వతంగా కాపాడటానికి ఈ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ ప్రకటన ఎంతో ఉపయోగపడుతుంది. స్థానికంగా అటవీ శాఖ అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించి, బ్లాక్ ఏర్పాటు పనులు త్వరగా ప్రారంభించాలి.
ALSO READ: Passenger Train: బ్రిడ్జి మీది నుంచి పట్టాల మీద పడిపోయిన ట్రక్, రైళ్ల రాకపోకలు బంద్!