Raghunandan Rao: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌజ్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా మొత్తం ఎనిమిది మంది వీఐపీలను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటనపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేటలో తీవ్రంగా స్పందించారు. సమాజాన్ని డ్రగ్స్ మహమ్మారి నుండి రక్షించి ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత గల ప్రజాప్రతినిధులే స్వయంగా మత్తులో మునిగిపోవడం అత్యంత బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. అసలు డ్రగ్స్ తీసుకున్న ఈ నాయకులు ప్రజలకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. సోదాలకు వెళ్లిన ఈగల్ టీమ్ అధికారులపైనే కాల్పులు జరిపారంటే వారు ఎంతటి మత్తులో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. మత్తు మందు ప్రభావం వల్ల విచక్షణ కోల్పోయి పోలీసులపైనే తిరగబడటం వ్యవస్థల పట్ల వారికి ఉన్న బరితెగింపును సూచిస్తోందని విమర్శించారు.
చట్టం ముందు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరూ సమానం కాదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులపై కాల్పులకు తెగబడిన వారిపై సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసి తక్షణమే రిమాండ్కు పంపాలని అధికారులను కోరారు. ప్రజాప్రతినిధుల ముసుగులో నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించకూడదని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఎస్వోటీ (SOT) పోలీసులు రంగంలోకి దిగి లోతైన విచారణ జరుపుతున్నారు.
హైదరాబాద్ శివారులో జరిగిన ఈ ఉదంతం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈగల్ టీమ్ను అడ్డుకునే ప్రయత్నం చేయడం అలాగే తుపాకీ కాల్పుల కలకలం వెనుక మరేదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన వారిలో ఉన్న ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధం ప్రకటించిన ఈ తరుణంలో సాక్షాత్తు పార్లమెంట్ సభ్యుడే డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also: Moinabad Drug Case: కేటీఆర్ డ్రగ్స్ టెస్టులకు సిద్ధమా? మహేశ్కుమార్ గౌడ్ సవాల్