Etela Rajender: బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ మారోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్నోళ్లు సీనియర్ లీడర్లు కాదని.. రాజకీయాల్లో ఉన్నవారే అసలైన సీనియర్ అంటూ వ్యాఖ్యానించారు. పార్టీలో గత కొంతకాలంగా జరుగుతున్న సీనియర్, జూనియర్ రచ్చపై ఈ మేరకు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. గెలుపు గర్వంతో కాకుండా ప్రజాసేవకే అంకితమవ్వాలని పార్టీ నేతలు, శ్రేణులకు సూచించారు.
ఇటీవల ఎన్నికైన బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమాన్ని నిజామాబాద్ లోని కమ్మ సంఘంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు హుందాగా వ్యవహరించాలన్నారు. గెలుపు గర్వంతో ముందుకు వెళ్తే భవిష్యత్తు రాజకీయం అంధకారమవుతుందన్నారు. అలాగే ప్రజలకు సేవ చేసినప్పుడే నిజమైన గుర్తింపు వస్తుందన్నారు.
రాజకీయ చరిత్రలో రైతులతో పెట్టుకున్న ఏ పార్టీ కూడా బతికి బట్టకట్టలేదని ఈ సందర్భంగా ఎంపీ ఈటల పేర్కొన్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ (BRS) విర్రవీగిన తనంతో ముందుకు వెళ్లిందన్నారు. ప్రజలు, రైతులను, ఉద్యోగులను పట్టించుకోకుండా అహంకారపూరిత పాలన చేసిందన్నారు. చివరికి ఆ పార్టీ.. మట్టిలో కలిసిపోయిందన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రి హోదాలో తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ప్రతిపక్షంలో ఉన్న డీఎస్ మెచ్చుకున్నారని ఈటల గుర్తుచేశారు. ఆయన రాజకీయ గురువైన అర్గుల రాజారాం.. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్తో దానిని పోల్చారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ డీఎస్ హుందాతనం ప్రదర్శించేవారన్నారు. ప్రతిపక్షం అంటేనే విమర్శించడం కాదని.. అధికార పక్షం అంటే అధికారం చూపడం కాదని ఈటల పేర్కొన్నారు.
Also Read: Bullet Train Ticket: బుల్లెట్ రైలు టికెట్ ధరలపై.. పిచ్చక్లారిటీ వచ్చేసింది.. సామాన్యులకు పండుగే!