fake rs 500 Notes: నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో దొంగ నోట్ల కలకలం రేగింది. బ్యాంకులో పంట రుణం చెల్లించేందుకు వచ్చిన ఒక రైతు వద్ద భారీ స్థాయిలో నకిలీ నోట్లు బయటపడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
జలాల్పూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు అనే రైతు, తాను తీసుకున్న క్రాప్ లోన్ తిరిగి చెల్లించడానికి వర్ని మండల కేంద్రంలోని బ్యాంకుకు వెళ్లారు. ఆయన తన వద్ద ఉన్న రూ. 2,08,500 నగదును క్యాషియర్కు అందజేశారు. నోట్లను లెక్కించే సమయంలో అనుమానం వచ్చిన క్యాషియర్, వాటిని క్షుణ్ణంగా పరిశీలించగా అవి నకిలీవని తేలింది. సాయిలు తెచ్చిన నగదులో 417 నోట్లు నకిలీవని బ్యాంక్ అధికారులు గుర్తించారు.
వెంటనే స్పందించిన బ్యాంక్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. వర్ని ఎస్ఐ రాజు ఘటనా స్థలానికి చేరుకుని, ఆ నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అమాయక రైతు వద్దకు ఇన్ని నకిలీ నోట్లు ఎలా వచ్చాయి? ఆయనకు ఈ డబ్బును ఎవరు ఇచ్చారు? దీని వెనుక ఏదైనా అంతరాష్ట్ర దొంగ నోట్ల ముఠా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. భారీ మొత్తంలో దొంగ నోట్లు బయటపడటంతో వ్యాపారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగదు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ALSO READ: Tirupati district: కొడుకుపై ప్రేమ.. శ్మశానంలో సీసీ కెమెరాలు పెట్టించిన తండ్రి