హైదరాబాద్ నగరంలో విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. వైద్య విద్య చదవకుండానే డాక్టర్ అవతారమెత్తి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఒక నకిలీ వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పదో తరగతి కూడా పాస్ కాకపోయినా ఏకంగా ఇరవై ఏళ్లుగా డెంటల్ క్లినిక్ నడుపుతున్న ఒక వ్యక్తి గుట్టును మల్కాజ్గిరి ఎస్ఓటి (స్పెషల్ ఆపరేషన్ టీమ్) పోలీసులు రట్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రమేష్ అనే వ్యక్తి చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. ఇక్కడ స్థిరపడిన తర్వాత సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో వైద్యుడి అవతారమెత్తాడు. నేరేడ్మెట్ ప్రాంతంలో ఒక డెంటల్ క్లినిక్ ఏర్పాటు చేశాడు. తాను బీడీఎస్ పూర్తి చేశానని నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి బోర్డు తగిలించాడు. ఎలాంటి అర్హత లేకపోయినా దంత వైద్యం చేయడం ప్రారంభించాడు. దాదాపు ఇరవై ఏళ్లుగా స్థానిక ప్రజలకు చికిత్స అందిస్తూ వారిని నమ్మిస్తున్నాడు.
రమేష్ వైద్యం చేసే విధానం చాలా విచిత్రంగా ఉండేది. పగటి పూట క్లినిక్ మూసి ఉంచేవాడు. రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము వరకు మాత్రమే రోగులకు చికిత్స అందించేవాడు. ఈ వింత సమయాల వల్ల ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. రాత్రి పూట వచ్చే పేద మధ్యతరగతి రోగులను లక్ష్యంగా చేసుకుని దంతాల పీకడం, అమర్చడం వంటి పనులు చేసేవాడు.
ఇటీవల రమేష్ అందించిన చికిత్సల మీద కొంతమంది స్థానికులకు అనుమానం వచ్చింది. అతని ప్రవర్తన, సమయాలు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందింది. మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు నేరేడ్మెట్ పోలీసులతో కలిసి ఆ క్లినిక్పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. క్లినిక్లోని రికార్డులు, సర్టిఫికెట్లు పరిశీలించగా అసలు నిజాలు బయటపడ్డాయి. రమేష్ కనీసం పదో తరగతి కూడా ఉత్తీర్ణుడు కాలేదని తేలింది.
నకిలీ సర్టిఫికెట్లతో ప్రజలను మోసం చేస్తున్న రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్లినిక్లోని వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అర్హత లేని వ్యక్తుల వద్ద వైద్యం చేయించుకోవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Jabardasth Naresh: ఆ ఒక్క నిర్ణయంతో రెండేళ్లు కెరియర్ కోల్పోయా.. జబర్దస్త్ నరేష్ ఎమోషనల్!