Fake Seeds: సత్తుపల్లి పట్టణంలో నకిలీ వరి విత్తనాల వ్యవహారం రైతుల జీవితాలను కుదిపేసింది. స్థానికంగా ఉన్న వెంకటరమణ సీడ్స్ వద్ద కొనుగోలు చేసిన విత్తనాలు నాణ్యత లేనివిగా తేలడంతో సిద్ధారం, సదాశివునిపాలెం, రేజర్ల గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. రబీ సీజన్ను ఆశగా ఎదురుచూసిన రైతులు అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేసినప్పటికీ అవి సరిగా మొలకెత్తకపోవడం, తాలు గింజలు రావడం వల్ల పంట పూర్తిగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మళ్లీ విత్తనం వేయాల్సిన పరిస్థితి ఏర్పడి అప్పుల బారిన పడుతున్నామని తెలిపారు.
Also Read: F-35 Crash: రాడర్లకే దొరకదు అనుకున్నారు.. ఇరాన్ ఇచ్చి పడేసింది, అమెరికా F-35 కథ క్లోజ్?
మాకు నాణ్యమైన విత్తనాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఒక్కో ఎకరానికి వేల రూపాయలు ఖర్చు పెట్టినా ఇప్పుడు ఖాళీ భూమి మాత్రమే మిగిలింది” అంటూ రైతులు వాపోయారు. ఈ సందర్భంగా రైతులు తమ డిమాండ్లను స్పష్టంగా వెల్లడించారు. నాసిరకం, నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై విత్తనాల చట్టం, 1966, విత్తనాల నియంత్రణ ఉత్తర్వు, 1983 ప్రకారం వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేసినందుకు బాధ్యులపై ఐపీసీ 420 కింద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తమకు జరిగిన నష్టానికి వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం పూర్తి నష్టపరిహారం అందించాలని, విత్తనాల నాణ్యతపై వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే పరీక్షలు నిర్వహించి నిజాలు బయటపెట్టాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టడి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: TG Paddy Bonus: తెలంగాణ రైతులకు సంక్రాంతి కానుక.. అకౌంట్లలో బోనస్ డబ్బులు జమ