FSL Fire Accident: తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్)లో జరిగింది ప్రమాదమా? విద్రోహమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసి పడ్డట్టు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తే అసలు కారణాలు ఏమిటన్నది స్పష్టమవుతాయని అంటుండటం గమనార్హం. దేశంలోని అత్యంత అధునాతనమైన ఎఫ్ఎస్ఎల్ లలో రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ ఒకటి. 1967లో ఇది రెడ్ హిల్స్ లో మొదలు కాగా 1980 ప్రాంతంలో భవనాన్ని నిర్మంచారు.
ఎన్నో సంచలన కేసుల్లో కీలకమైన సాక్ష్యాధారాలను అందించిన ఘనత దీని సొంతం. గత ఏడాది డిజిటల్, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను పరిశీలించటానికి, విశ్లేషించటానికి, ధృవీకరించటానికి అవసరమైన చట్టపరమైన అధికారాన్ని ఐటీ చట్టం సెక్షన్ 79ఏ కింద కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దీనికి దఖలు పరిచింది. అప్పటి నుంచి ఎఫ్ఎస్ఎల్ గవర్నమెంట్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కేంద్రంగా గుర్తింపును సాధించింది. అప్పటి నుంచి డిజిటల్, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలకు సంబంధించి మన ఎఫ్ఎస్ఎల్ ఇచ్చే నివేదికలను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులు ఆమోదయోగ్యమైనవిగా గుర్తిస్తున్నాయి.
Also Read: Damodar Rajanarsimha: జోగిపేట ఎన్నికల ప్రచారంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు..?
ఈ క్రమంలోనే సంచలనం సృష్టించిన ఎన్నో కేసుల్లో స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్ టాప్ లు, ఇతర డిజిటల్ పరికరాలను విశ్లేషణ కోసం దర్యాప్తు అధికారులు ఎఫ్ఎస్ఎల్ కు పంపిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతోపాటు పలు ఆర్థిక మోసాల కేసుల్లోని సాక్ష్యాధారాలు ఎఫ్ఎస్ఎల్ భవనం మొదటి అంతస్తులోనే ఉన్నాయి. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఛార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించటానికి సిట్ సిద్ధమవుతున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ ఇన్ ఛార్జ్ గా హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ ను నియమించిన తరువాత ఈ కేసులో విచారణ ముమ్మరమైన విషయం తెలిసిందే.
సుప్రీం కోర్టు అనుమతితో కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావును రెండు వారాలపాటు కస్టోడియల్ విచారణ జరిపారు. ఈ క్రమంలో వెల్లడైన వివరాలు ఆధారంగా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లతోపాటు బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావులకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నందినగర్ లోని ఆయన నివాసంలో దాదాపు అయిదు గంటలపాటు విచారించారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగులు చేయటం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి వచ్చి చేరిన కోట్లాది రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్లు, భూ దందాలపై కీలక ఆధారాలను సిట్ సంపాదించినట్టుగా సమాచారం.
ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ తోపాటు కేటీఆర్, హరీష్ రావు, కొందరు ప్రభుత్వ అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ ఛార్జ్ షీట్ ను రూపొందించి కోర్టుకు సమర్పించాలని సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎఫ్ఎస్ఎల్ లో అగ్నిప్రమాదం జరగటం…మంటలు ఎగిసి పడ్డ మొదటి అంతస్తులోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, ఇతర డిజిటల్ ఆధారాలు ఉన్నట్టు తెలుస్తుండటం. మంటల్లో ఇవి ఆహుతైనట్టు సమాచారం వస్తున్న నేపథ్యంలోనే జరిగింది నిజంగా ప్రమాదమేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి పూర్తి స్థాయి దర్యాప్తు తరువాత ఎలాంటి వివరాలు వెలుగులోకి వస్తాయన్నది వేచి చూడాల్సిందే.