తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా బీఆర్ఎస్ మరోమారు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఎర్రవెల్లిలోని తన ఫామ్హౌస్లో పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన కీలక సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.
సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చరిత్రను పరిశీలిస్తే కాంగ్రెస్ ఎప్పుడూ తెలంగాణకు ద్రోహమే చేస్తూ వచ్చిందని ఆయన విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని.. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడుతోందని మండిపడ్డారు. తెలంగాణ అస్థిత్వం కోసం, ఇక్కడి ప్రజల హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇతర పార్టీలకు తెలంగాణ అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఎద్దేవా చేశారు.
తెలంగాణకు రావాల్సిన నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. నీటి వాటాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలందరికీ అర్థమయ్యేలా వివరిస్తామని చెప్పారు. ‘ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు.. తెలంగాణ ద్రోహుల అసలు రంగును బట్టబయలు చేస్తాం’ అని ఆయన హెచ్చరించారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముందుగా నిర్ణయించిన విధంగా మూడు జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. తెలంగాణ హక్కుల కోసం మరో ఉద్యమాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మౌనంగా ఉంటే భవిష్యత్తు తరాలకు నష్టం జరుగుతుందని, అందుకే ప్రజలను చైతన్య పరిచి పోరాట బాట పట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం మరియు నిరసన కార్యక్రమాల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు.
ALSO READ: CP Sajjanar: న్యూ ఇయర్ వేళ ‘జీరో డ్రగ్స్’ లక్ష్యం.. నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే సంగతులు: సజ్జనార్