Srinivas Goud: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమై ప్రయత్నించాయని, అధికార పార్టీ భయబ్రాంతులకు గురిచేస్తూ కొందరు పోలీస్ అధికారులను వినియోగించుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీ గణనీయమైన సీట్లతో విజయం సాధించిందని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 5 శాతం కూడా సీట్లు లేవని, ప్రస్తుతం బీఆర్ఎస్(BRS) పార్టీ 30 నుంచి 40 శాతం సీట్లను గెలుచుకుందని చెప్పారు.
50 ఓట్లలోపు తేడాతో ఐదు సీట్లు కోల్పోయామని, మద్యం, డబ్బు, అధికార దుర్వినియోగం జరిగినా 16 సీట్లలో విజయం సాధించామని పేర్కొన్నారు. పట్టణంలో పెండింగ్లో ఉన్న ట్యాంక్బండ్, వెయ్యి పడకల ఆసుపత్రి, గురుకులాల భవన నిర్మాణం, హజ్ హౌస్, క్రిస్టియన్ భవన్ వంటి కీలక అభివృద్ధి పనులను పూర్తిచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. వార్డుల వారీగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు కృషి చేస్తారని అన్నారు. ఎన్నికల సమయంలో చేసిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం పట్టించుకోలేదని, డబ్బుల సంచులు నియోజకవర్గాలకు తరలిస్తున్న విషయాలను పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజలకు శుద్ధి చేయని నీటిని సరఫరా చేస్తున్నారని, ఆయా ప్రాంతాలను బీఆర్ఎస్ కౌన్సిలర్లు పరిశీలిస్తారని చెప్పారు.
Also Read: Divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్ తో మాధురి పెళ్లి.. ఆమె భర్త రియాక్షన్ ఇదే?
ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ ఎన్నికల్లో స్పష్టంగా బయటపడిందని అన్నారు. బీసీ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి జడ్పీటీసీ(ZPTC), ఎంపీపీ(MPP) ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు. కచ్చితంగా వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీదేనని, కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఘనంగా సన్మానించారు.
Also Read: Mosquitoes: ఈ బ్లడ్ గ్రూప్ అంటే దోమలకు ఎందుకంత ఇష్టం? ఎందుకంత స్పెషల్?