Mahabubabad: స్వేఛ్చ బ్యూరో: మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత(Maloth Kavitha), మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్(MLA Banoth Shankar Naik) పార్టీ నాశనం చేస్తున్నారని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న ఆరోపించారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో 36 వ వార్డు తరఫున మార్నేని వెంకన్న వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేశారు.
అయితే పోటీలో ఉండేందుకు సిద్ధమవుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సూచన మేరకు నామినేషన్ దాఖలను ఉపసంహరించుకుంటున్నట్లు మంగళవారం వెల్లడించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. మా పార్టీ ఉద్యమకారులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఆలోచన మేరకు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహబూబాబాద్లో బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలాటగా సాగుతుందన్నారు. ఉద్యమం చేసినప్పుడు లేని వారి పెత్తనం ప్రస్తుతం పార్టీలో సాగుతుందన్నారు. ఉద్యమకారులకు విలువలు లేకుండా పోతుందన్నారు. కేటీఆర్ హామీ మేరకు నామినేషన్ దాఖలను ఉపసంహరించుకుంటున్నట్లుగా వెంకన్న మీడియాకు వివరించారు.
కేటీఆర్(KTR) మీద ఉన్న గౌరవంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. నాకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, నా వార్డు ప్రజలు వాళ్ళందరితో చర్చించాకనే ఏ నిర్ణయమైన తీసుకుంటామన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో మున్నూరు కాపు వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీలో ఒక్కరికి కూడా వార్డు కౌన్సిలర్ గా టికెట్ ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ కారణం మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలవుతు కవితలేనని స్పష్టం చేశారు. అందుకు ఈ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు.