ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తదుపరి ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్నది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఏసీబీ చార్జ్షీట్ దాఖలు చేయడం, దానిని నాంపల్లి కోర్టుకు సమర్పించడం రెండు జరిగిపోయాయి. అయితే, ఈ కేసులో ఏసీబీ అధికారులు తర్వాత ఏ స్టెప్ తీసుకోబోతున్నారనే దానిపై చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏ2గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ను అధికారులు పలుమార్లు విచారించారు. కేటీఆర్, అరవింద్ కుమార్ స్టేట్మెంట్స్ సైతం రికార్డు చేశారు. తాజాగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ కోసం చార్జ్షీట్ దాఖలు చేయడంతో ముందుగా ఎవరికి నోటీసులు జారీ చేసి విచారిస్తారో అని రాష్ట్ర రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది.
సాధారణంగా ఎవరైనా ఒక ప్రజాప్రతినిధిని ఏదైనా కేసులో విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి.సాధారణ విచారణ అనగా సాక్షిలాగా అయితే దానికి గవర్నర్ అనుమతి అవసరం లేదు.కానీ, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ కోసం ఏసీబీ చార్జ్షీట్ దాఖలు చేయడంతో గవర్నర్ అనుమతి అనివార్యమైంది. ఈ క్రమంలోనే దర్యాప్తు సంస్థ ముందుగా గవర్నర్ నుంచి అనుమతి తీసుకున్నది. ఇంతకాలం విచారణ అందుకే ఆలస్యం అయినట్టు తెలుస్తున్నది. పర్మిషన్ రావడంతో త్వరలోనే కేటీఆర్ను అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తారని ప్రచారం జరుగుతోంది. కాగా, ఐఏఎస్ అరవింద్ కుమార్ను డీవోపీటీ ఇప్పటికే విధుల నుంచి తప్పించింది. ఈ కేసు నుంచి ఆయన బయటపడేదాక మరల పోస్టింగ్ కూడా రావడం కష్టంగా తెలుస్తోంది.
ఫార్ములా ఈ కార్ కేసు విచారణ ముందుకు వచ్చిన ప్రతిసారీ ఇదొక ఫాల్స్ లేదా లొట్టపీసు కేసు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తూ వచ్చారు. తాజాగా నిన్న అసెంబ్లీ సెషన్స్ సందర్భంగా మరోసారి మీడియాతో మాట్లాడుతూ… ఇదొక లొట్టపీసు కేసు అని, గతంలో ఇదే ఏసీబీ విచారించి అవినీతిని బయటకు తీసుకురాలేకపోయారని గుర్తుచేశారు. నిధుల బదిలీలో ఎటువంటి అవకతవకలకు తాము పాల్పడలేదని, అన్ని సవ్యంగానే చెల్లింపులు చేశామన్నారు. నాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో అవినీతికి ఆస్కారం లేదని కొట్టిపారేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆరు గ్యారెంటీల టాపిక్పై ప్రతిపక్షాలు కార్నర్ చేయకుండా ఉండేందుకు, మరోసారి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఫార్ములా ఈ కార్ రసు కేసును సర్కారు మరోసారి తెరమీదకు తెచ్చిందని కేటీఆర్ ప్రధానంగా ఆరోపించారు.
Dumping Yard: హుజూరాబాద్ పొలిమేరల్లో కాకరేపుతున్న డంపిగ్ సెగ.. రగులుతున్న జనం
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ కేసు లొట్టపీసు అయితే విచారణను ధైర్యంగా ఎదుర్కోవాలని, భయం ఎందుకు అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందనేది వాస్తవమని, లేకపోతే ఏసీబీ కేసు ఎందుకు పెడుతుందని ఆమె ప్రశ్నించారు. అసలు ఈ కేసులో అవినీతి నిజంగానే జరిగిందా?లేదా? అనేది దర్యాప్తలో తెలుస్తుందని, అందుకు కేటీఆర్ అధికారులకు సహకరించాలని ఆమె డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, అక్రమాలకు పాల్పడిన వారు శిక్షను ఎదుర్కోవాల్సిందే అని మంత్రి స్పష్టంచేశారు.