Formula E Race: ఫార్ములా ఈ కారు రేసు కేసులో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది తెలంగాణ సర్కార్. తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటీషన్పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ అందులో ప్రస్తావించింది ప్రభుత్వం. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది. ఈ నేపథ్యంలో ముందుగా అలర్ట్ అయిన రేవంత్ సర్కార్, ఓ అడుగు ముందుకేసింది.
క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టి వేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్దమవుతున్నారు కేటీఆర్. కేవలం కేటీఆర్ పిటిషన్పై వాదనలు విని తీర్పు ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం వెర్షన్ వినాలని పేర్కొంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదులతో కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్షణమైనా ఆయన పిటిషన్ దాఖలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఈనెల 6న విచారణకు రావాలని కేటీఆర్కు తొలుత ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అయితే ఆఫీసు వరకు వచ్చిన కేటీఆర్, తనతోపాటు లాయర్ను అనుమతించాలని లింక్ పెట్టారు. అందుకు అధికారులు ససేమిరా అన్నారు. సోమవారం సాయంత్రం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 9న విచారణకు రావాలని అందులో పేర్కొంది. 9 తేదీ నాటికి తనలో లాయర్ తెచ్చుకునేలా కేటీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: హైకోర్టు తీర్పు, నేతల టెన్షన్.. నోరు విప్పిన హరీష్రావు
నార్మల్గా హైకోర్టు తీర్పు వెల్లడైన వెంటనే పార్టీ ఆఫీసుకు కేటీఆర్, మిగతా నాయకులు చేరుకున్నారు. ఈలోగా పార్టీ లీగల్ టీమ్ అక్కడికి వచ్చింది. జరుగుతున్న పరిణామాలను చర్చించారు. వెంటనే అందుబాటులో ఉన్న ఢిల్లీ న్యాయవాదులతో మంతనాలు జరిపారు. ఈ క్షణమైనా సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించే అవకాశముందనే వార్త తెలంగాణ ప్రభుత్వం చెవిలో పడింది. వెంటనే రంగంలోకి దిగేయడం, కేవియట్ దాఖలు చేయడం చకచకా జరిగిపోయింది.