G Kishan Reddy: హైదరాబాద్ రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రెండో దశపై కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో చర్చించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. మెట్రో రెండో దశకు కేంద్రం ఇప్పటికే సానుకూలత తెలిపిందని, అయితే ప్రస్తుతం L&T నిర్వహణలో ఉన్న మొదటి దశను ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్న తర్వాతే రెండో దశ పనులు ముందుకు సాగుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఎల్ అండ్ టీ (L&T) నుంచి మొదటి దశ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను ముందుగా పూర్తి చేయాలని కేంద్రం సూచించింది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు పూర్తయిన తర్వాతే రెండో దశపై తదుపరి చర్యలు ఉంటాయని కేంద్రం పేర్కొంది.
మెట్రో పనుల సన్నాహాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో కేంద్రం తరఫున ఇద్దరు, రాష్ట్రం తరఫున ఇద్దరు అధికారులు ఉండాలని, కమిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారుల పేర్లను ఇంకా పంపలేదని కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. వెంటనే పేర్లను ప్రతిపాదించి సమావేశం నిర్వహించేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు.
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మెట్రో విస్తరణ అత్యవసరమని, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కిషన్ రెడ్డి కోరారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రో నెట్వర్క్ను త్వరితగతిన స్వాధీనం చేసుకుని, రెండో దశ ప్రతిపాదనలను అధికారికంగా కేంద్రానికి పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Also: ఏకంగా 47 లక్షల సోషల్ మీడియా అకౌంట్లు క్లోజ్ చేసిన ప్రభుత్వం, ఇక కష్టమే!