BJP Telangana: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం లంగర్ హౌజ్ బాపూఘాట్ కు సమీపంలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్తో పాటు పేదల ఇళ్లను తొలగించేందుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అభివృద్ధి మంత్రం జపిస్తున్న కాంగ్రెస్ సర్కార్, క్షేత్రస్థాయిలో మాత్రం సామాన్యుల పొట్ట కొడుతోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా బాపు ఘాట్ వద్ద రూ.5,000 కోట్లతో నిర్మించ తలపెట్టిన ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్ట్ ఇప్పుడు వందలాది కుటుంబాల పాలిట శాపంగా మారింది. అహింసావాది అయిన గాంధీజీ పేరు పెట్టుకుని, ప్రజల ఇళ్లను బలవంతంగా లాక్కోవడంపై బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న ఈ కూల్చివేతల పర్వంపై భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించింది. బాధితులకు భరోసా కల్పించేందుకు బీజేపీ నేతల బృందం గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. ముఖ్యంగా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులను, మూసీ పరివాహక ప్రాంత బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని పార్టీ స్పష్టం చేసింది. ఎటువంటి సామాజిక ప్రభావ అంచనా లేకుండానే హడావుడిగా నోటీసులు జారీ చేయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గాంధీజీపై లేని ప్రేమను ఒలకబోస్తూ, రూ.వేల కోట్లతో విగ్రహాలు పెట్టడం కంటే పేదల గూడు కాపాడటం మిన్న అని బీజేపీ డిమాండ్ చేస్తోంది. సుమారు 15 ఏళ్ల క్రితం అన్ని అనుమతులతో నిర్మించుకున్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లోని 450 కుటుంబాలకు ఇప్పుడు దిక్కుతోచని స్థితి నెలకొంది. ప్రభుత్వం కేవలం టీడీఆర్ బాండ్లు ఇస్తామనడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఇళ్లను గాంధీ విగ్రహం కోసం వదులుకోవాలా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
Also Read: BJP Telangana: కాళ్లకు బలపం కట్టుకుని మరీ బీజేపీ ప్రచారం.. యమ సీరియస్గా హైకమాండ్..!
కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను సాక్షాత్తూ గాంధీజీ మునిమనవడు తుషార్ గాంధీ సైతం తప్పుబట్టడం గమనార్హం. ప్రజలను నిర్వాసితులను చేసి గాంధీ విగ్రహం పెట్టడం అత్యంత అప్రజాస్వామికమని గాంధీ పేరుతో వద్దని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయోగాలు సామాన్యుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. దీనిపై బీజేపీ చేస్తున్న పోరాటంలో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ బృందం కలిసి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ తో ఇండ్లు కోల్పోతున్న బాధితులను పరామర్శించనున్నారు.
గురువారం ఉదయం 9 గంటలకు బాపూ ఘాట్ కు బీజేపీ నేతలు చేరుకుని గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. 9:15 గంటలకు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసులు, శ్రీవిఘ్నేశ్వర కాలనీ, కేకే నగర్ కాలనీవాసులతో భేటీ అవ్వనున్నారు. అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చడం అప్రజాస్వామికమని, ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను అడ్డుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. డీపీఆర్ లేకుండానే కూల్చివేతలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మూసీ సుందరీకరణ వెనుక భారీ స్కామ్ ఉందని, పేదలను వెళ్లగొట్టి ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించే కుట్ర జరుగుతోందని కాషాయ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజల పక్షాన పోరాడుతూ, బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ సర్కార్ను వదిలిపెట్టబోమని బీజేపీ తమ కార్యచరణను ప్రకటించింది. ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలంటూ డిమాండ్ చేస్తోంది.