BJP Telangana: ఎన్నికల సమరంలో దూకుడు మీదున్న భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు సొంత పార్టీ నేతలే పెద్ద తలనొప్పిగా మారారు. పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు స్వతంత్రులుగా నామినేషన్లు వేయడం అధిష్టానానికి సవాలుగా మారింది. పార్టీ గెలిచే అవకాశాలున్న చోట ఏకంగా ముగ్గురు, నలుగురు చొప్పున నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. నామినేషన్ల ఉపసంహరణకు గడువు సమీపిస్తోంది. ఈనెల 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల లోపు విత్ డ్రాకు సమయం ఉంది. కాగా అభ్యర్థులు మాత్రం ససేమిరా అంటుండటం రాష్ట్ర నాయకత్వానికి పెద్ద టాస్క్ గా మారింది. బుజ్జగింపులకు లొంగకపోగా, కొందరు నేతలు ఏకంగా పార్టీ నాయకత్వానికే ఎదురుతిరుగుతుండటం కేడర్ను అయోమయంలో పడేస్తోంది.
వేళ రెబల్స్ వ్యవహారం పార్టీకి పెద్ద సవాలు
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు సమీపిస్తున్న వేళ రెబల్స్ వ్యవహారం పార్టీకి పెద్ద సవాలుగా మారింది. కొత్తగా పార్టీలో చేరిన వారు, పాత నిబద్ధత గల కార్యకర్తల మధ్య నడుస్తున్న కొత్త-పాత వివాదానికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. 60:40 నిష్పత్తిలో బీఫారాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసినట్లు సమాచారం. సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూనే, గెలుపు గుర్రాలైన కొత్త నేతలకు కూడా అవకాశం కల్పించి సమతుల్యత పాటించే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ, కొందరు అభ్యర్థులు మాత్రం బరిలో ఉండి తీరుతామంటూ పట్టుబడుతున్నారు. పాత, కొత్త సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం పాత నేతలకు మింగుడుపడటంలేదు. దశాబ్దాల సేవను విస్మరించి, నిన్నగాక మొన్న వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారా అని రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. పార్టీ బీఫామ్ ఇవ్వకుంటే రెబల్ గా అయినా సరే.. బరిలో నిలుస్తామని కరాఖండిగా చెబుతున్నట్లు సమాచారం.
కమలం పార్టీకి చెందిన వారే ముగ్గురు
తెలంగాణలో కాషాయ పార్టీ ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లో బలంగా ఉంది. ఈ ప్రాంతంలో కమలం పార్టీకి చెందిన వారే ముగ్గురు, నలుగురు నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది. వీటితో కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లుగా సమాచారం. పార్టీ బలంగా ఉన్న చోట్ల ఓట్లు చీలిపోవడం వల్ల ప్రత్యర్థులకు లాభం చేకూరుతుందన్న ఆందోళన కాషాయదళంలో వ్యక్తమవుతోంది. టికెట్ దక్కని వారికి భవిష్యత్ లో పార్టీలో పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఆశచూపి అభ్యర్థులను ఒప్పించేందుకు నాయకత్వం రాయబారాలు నడుపుతున్నా కొందరు మాత్రం తమ దారి తమదేనంటూ తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. కాగా ఈ అంశంపై రాష్ట్ర నాయకత్వం సైతం సీరియస్ అయింది. రెబల్ గా బరిలో ఉన్నా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టినా ఉపేక్షించబోమని హెచ్చరించింది. క్రమశిక్షణ చర్యలు తప్పవని అల్టిమేటం జారీచేసింది. ఇప్పుడు రెబల్ గా బరిలోకి నిలిస్తే వారిపై బహిష్కరణ వేటు తప్పదని, తిరిగి భవిష్యత్ లోనూ పార్టీలో చేర్చుకోబోమని హెచ్చరించింది. మరి అధిష్టానం హెచ్చరికలకు రెబెల్స్ తలొగ్గుతారా? లేక మొండిగా బరిలో నిలిచి పార్టీ ఓట్లను చీల్చుతారా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ గండం నుంచి బీజేపీ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.
Also Read: Telangana BJP: కమళం పార్టీ సరికొత్త వ్యూహం.. బీఫామ్ల అందజేతలో బీజేపీ కీలక నిర్ణయం..?