BJP Telangana: బ్యూరో స్వేచ్ఛ: రాష్ట్రంలో ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ రణం క్లైమాక్స్కు చేరుకుంది. సోమవారంతో ప్రచార పర్వం ముగియనుండటంతో భారతీయ జనతా పార్టీ తన సర్వశక్తులూ ఒడ్డుతోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ అసాధారణ రీతిలో రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరగనున్న ఈ ఎన్నికలను పార్టీ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే కమలం నేతలు ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా కాళ్లకు బలపం కట్టుకుని క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కనీసం 5 మున్సిపల్ కార్పొరేషన్లను, 70 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ బరిలోకి దిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, రామగుండం వంటి కార్పొరేషన్లపై పార్టీ ధీమాగా ఉంది. కనీసం 3 నుంచి 4 కార్పొరేషన్లలో జెండా పాతడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ, వాటిని పక్కన పెట్టి మరీ బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో తిష్ట వేశారు. ఎవరికి వారు తమ లోక్ సభ పరిధిలోని మున్సిపాలిటీల బాధ్యతను భుజాన వేసుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా పాలమూరులో బహిరంగ సభ నిర్వహించినా అక్కడికి వెళ్లకుండా కరీంనగర్ లోనే ఉండి బీజేపీ గెలుపు కోసం సీరియస్ గా శ్రమిస్తున్నారు. ఈ ఎన్నికలు ఎంతో కీలకమని హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇతర ఎంపీలు సైతం ఎవరికి వారుగా వారి సొంత లోక్ సభ సెగ్మెంట్లలో, వారు ప్రభావితం చేయగలిగే అన్ని స్థానాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా హైకమాండ్ నిర్దేశించిన టార్గెట్ ను వారు చేరుకుంటారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Also Read: Chandrababu Naidu: లడ్డూ కల్తీ వెనుక భారీ కుట్ర.. గత ప్రభుత్వంపై చంద్రబాబు సంచలన ఆరోపణలు!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జాతీయ నేతలతో రెండు భారీ బహిరంగ సభలను మాత్రమే బీజేపీ నిర్వహించింది. అందులో ఒకటి పాలమూరులో నిర్వహించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హాది కాగా మరొకటి సిర్పూర్ కాగజ్ నగర్ లో నిర్వహించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్మవీస్ ది. కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగ సభ కూడా ఉండాల్సింది.. కానీ అనివార్య కారణాల వల్ల చివరి క్షణంలో రద్దయింది. షా సభ నిర్వహిస్తే పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగేదని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. ఇదిలాఉండగా పోలింగ్ శాతం పెంచడం, పార్టీ కేడర్ను సమన్వయం చేయడంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. చివరి రోజు కావడంతో రోడ్ షోలు, స్ట్రీట్ కార్నర్ మీటింగులతో పట్టణ ప్రాంతాలను హోరెత్తించనున్నారు. ప్రచార గడువు ముగిసిన అనంతరం తదుపరి బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకత్వం శ్రేణులు, అభ్యర్థులకు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. మరి బీజేపీ వ్యూహాలు ఎంతమేరకు ఫలించాయనేది తెలుసుకునేందుకు ఈనెల 13న ఫలితాలు రిలీజయ్యేంత వరకు ఆగాల్సిందే.
Also Read: Mini Stroke: పక్షవాతం రాకముందే మేల్కొనండి.. మినీ స్ట్రోక్ లక్షణాలను అస్సలు వదలకండి