Chilukuru Balaji Temple Garuda Prasadam: కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం.. హైదరాబాద్ వీసా దేవుడైన చిలుకూరు బాలాజీ ఆలయంలో గురువారం నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీ ఆలయం.. ప్రతిరోజూ భక్తులతో కిటకిటలాడుతుంటుంది. 11 ప్రదక్షిణలు చేసి.. కోరిక కోరితే.. ఆ కోరిక తీరాక మొక్కు తీర్చుకోవడం ఇక్కడ ఎన్నోఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం. కాగా.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు సంతానం లేని మహిళలకు గరుడ ప్రసాదాన్ని అందజేయనున్నట్లు ఆలయ అర్చకులు రంగరాజన్ ముందుగానే తెలిపారు.
అయితే.. ప్రసాదం కోసం వచ్చేవారు ఉదయం 8 గంటల్లోపే రావాలని చెప్పడంతో చిలుకూరుకు భక్తులు పోటెత్తారు. గరుడ ప్రసాదం కోసం భక్తులు చిలుకూరుకు క్యూ కట్టడంతో.. ఆ మార్గంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు కాలినడకనే ఆలయానికి చేరుకున్నారు. మాసబ్ ట్యాంక్ నుంచే ట్రాఫిక్ స్తంభించింది. గరుత్మంతునికి సమర్పించిన నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల్లోపే ఈ ప్రసాదం పంపిణీ ఉంటుంది. అది కూడా మహిళలకు మాత్రమేనని చెప్పడంతో చిలుకూరుకు ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరిగింది.
Also Read: హనుమాన్ జయంతి ఎప్పుడు.. ఆ రోజున ఎలా పూజలు చేయాలి..?
గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డు సైతం వాహనాలతో నిండిపోయింది. గంటలతరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిలుకూరు మార్గంవైపు ఎవరూ రావొద్దని పోలీసులు సూచించారు. దేవస్థానం వారు 5 వేల మంది భక్తులు వస్తారని చెప్పగా.. దాదాపు 60 వేల మంది భక్తులు ప్రసాదం కోసం ఆలయానికి పోటెత్తినట్లు పోలీసులు తెలిపారు. ప్రసాదం పంపిణీ పూర్తయిందని చెప్పినా.. భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారన్నారు.
500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతిఏటా శ్రీరామనవమి మర్నాడు.. అంటే దశమి నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. గురువారం సెల్వకూత్తుతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. నేడు ధ్వజారోహణం, శేషవాహన సేవలు, రేపు గోపవాహన, హనుమంత సేవలు, 21న సూర్యప్రభ వాహనం, గరుడవాహన సేవలు జరుగుతాయి. శనివారం రాత్రి 10.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం, 22న వసంతోత్సవం, గజవాహన సేవలు, 23న పల్లకీసేవ, అదేరోజు రాత్రి 12 గంటలకు దివ్యరథోత్సవ కార్యక్రమం, 24న మహాభిషేకం, ఆస్థానసేవ, అశ్వవాహన సేవ, దోప్ సేవ, పుష్పాంజలి సేవలను నిర్వహిస్తారు. 25న చక్రతీర్థం, ధ్వజావరోహణం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.