CP Sajjanar: కన్న తల్లిందండ్రులను రోడ్డుపై వదిలేస్తే కఠిన చర్యలు తప్పవని హైదారాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. కొంతకాలంగా చాలామంది ఫిర్యాదు దారులు తనను కలుస్తున్నారని చెప్పారు.
నిత్యం ఎంతోమంది బాధితులు తమ కష్టనష్టాలను చెప్పుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. గతంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా, వివిధ జిల్లాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన సమయంలోనూ, ప్రస్తుతం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా ఉన్నప్పటికీ ఒకే వాస్తవం తనను వెంటాడుతోందన్నారు. అదే కన్నవారిని సొంత బిడ్డలే అనాథలుగా మార్చడం.
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేయడం, రోడ్లపై వదిలేయడం, ఆశ్రమాలకు నెట్టేయడం వంటి సంఘటనలు తరచూ తన దృష్టికి వస్తున్నాయని సీపీ సజ్జనార్ తెలిపారు. “ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. మన సంస్కృతి, సంప్రదాయాలు, మానవ విలువలకు పూర్తిగా విరుద్ధం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కన్నవారి బాగోగులు చూడటం బిడ్డల కనీస ధర్మమని, దీనిపై ఎలాంటి చర్చలకు, సాకులకు తావులేదని స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు పిల్లల కోసం తమ జీవితాన్ని అంకితం చేస్తారని, వారి చదువు, భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారని గుర్తు చేశారు. అలాంటి వారిని వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయడం అత్యంత దుర్మార్గమని వ్యాఖ్యానించారు.
ఈ రోజు మీరు మీ తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తున్నారో, అదే రేపు మీ పిల్లలు మీతో ప్రవర్తించే విధానానికి పాఠం అవుతుంది. నేడు మీరు ఏది విత్తుతారో, వృద్ధాప్యంలో అదే కోసుకుంటారు” అని అన్నారు. ఈ మాటలు ప్రతి కుటుంబాన్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి.
Also Read: హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు కఠిన చర్యలు: మంత్రి పొంగులేటి
వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, హింసించినా ఉపేక్షించేది లేదు. కన్నవారిని రోడ్డున వదిలేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. దిక్కుతోచని స్థితిలో, తమ గోడు ఎవరూ వినడంలేదని కుమిలిపోతున్న ప్రతి వృద్ధుడికి, ప్రతి తల్లికి పోలీసుశాఖ అండగా ఉంటుంది. మీరు ఒంటరి వారు కాదు. మీ ఆత్మగౌరవం, భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. బాధితులు నిర్భయంగా నేరుగా సంప్రదించవచ్చు