GHMC Census: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లో జనగణనను పక్కాగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సిద్దమవుతుంది. తొలుత క్యూర్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల వారీగా వేర్వేరుగా జనగణన నిర్వహించాలని భావించినా, ఆ తర్వాత సర్కారు తీసుకున్న నిర్ణయం మేరకు క్యూర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనగణన నిర్వహించేందు బాధ్యతను జీహెచ్ఎంసీకి కట్టబెట్టినట్లు, కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ను ఇన్ ఛార్జిగా నియమించినట్లు సమాచారం. దీంతో సుమారు 2 వేల 53 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనున్న దాదాపు 300 మున్సిపల్ వార్డుల్లో జనగణనను పక్కాగా, పకడ్బందీగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం ప్రస్తుతం ఎన్యుమరేటర్ల నియామకంలో బిజీగా ఉంది. ఎన్యుమరేటర్లుగా నియమించి వారిలో టీచర్లకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని, ఆ తర్వాత ఇతర ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ఈ రకంగా మొత్తం 23 వేల 549 మంది ఎన్యుమరేటర్లను నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెల 26 నుంచి మే 11వ తేదీ వరకు నేరుగా పౌరులే జనగణన వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు, ఇందులో మిస్ అయిన వారి జనాభా లెక్కలు, సామాజిక వర్గం తదితర వివరాలను సేకరించేందుకు మే 11 నుంచి జూన్ 9 వరకు జనగణన నిర్వహించనున్నారు. ఎన్యుమరేటర్లుగా నియమితులైన వారు తొలుత గృహా సముదాయిల జాబితాను రూపొందించుకుని, ఆ తర్వాత జనాభా వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఈ సారి జరగనున్న జనగణన చాలా లోతుగా, పూర్తి వివరాలు సేకరించే దిశగా జరగనున్నట్లు అధికారవర్గాల సమాచారం.
Also Read: బీఆర్ఎస్ దోపిడీపై పదేళ్లు ఎందుకు మౌనం? కిషన్ రెడ్డిని నిలదీసిన భువనగిరి ఎంపీ
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో సుమారు కోటిరన్నర మంది జనాభా ఉన్నట్లు వారి వివరాలు సేకరణకు అవసరమై 23 వేల 549 మంది ఎన్యుమరేటర్లను నియమించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మే 11 నుంచి జూన్ 9 వరకు జరగనున్న జనగణనలో భాగంగా ఒక్కో ఎన్యుమరేటర్ కు దాదాపు 800 మంది పౌరుల సమాచారం సేకరించేలా, దాదాపు 250 నుంచి 300 గృహాల వరకు కేటాయించే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్యుమరేటర్ కు కేటాయించనున్న 250 నుంచి 300 గృహాల స్ట్రెచ్ కు ఓ పర్యవేక్షణాధికారిని కూడా నియమించనున్నట్లు సమాచారం. ఆశించిన స్థాయిలో 23 వేల 549 మంది ఎన్యుమరేటర్ల నియామకం జరిగితే, జనగణన మరింత పారదర్శకంగా, సక్రమంగా జరిగేలా ఒక్కో ఎన్యుమరేటర్ కు కేటాయించాల్సిన గృహాల సంఖ్య, పౌరుల సంఖ్యను తగ్గించాలని కూడా అధికారులు భావిస్తున్నారు. ఎన్యుమరేటర్లుగా విధులు నిర్వహించే వారి వివరాలు, ముఖ్యంగా టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వివరాల సేకరణ కోసం ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ప్రభుత్వ శాఖలోని ఉద్యోగుల జాబితా కోసం లేఖలు రాసినట్లు తెలిసింది.
క్యూర్ సిటీ పరిధి మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత జూన్, జూలై మాసంలో వాటికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివిధ ప్రభుత్వ శాఖల్లో విస్తృతంగా చర్చలు జరిగినా, ఈ ఏటా క్యూర్ లోని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశాలు అంతంత మాత్రమేనని చెప్పవచ్చు. జనగణనలో సేకరించిన సమాచారం మేరకు మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్య పెరగకపోయినా, వార్డుల డీలిమిటేషన్ మళ్లీ జరిగే అవకాశమున్నట్లు అధికారవర్గాల సమాచారం. పైగా కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని విపక్షాలు కూడా పెద్దగా గళం విన్పించకపోవటంతో సర్కారు కూడా ఫోకస్ చేయటం లేదని, సర్కారు సిటీలో తనదైన మార్కు అభివృద్ది పనులు చేపట్టిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం.
Also Read: బీఆర్ఎస్ భవన్లో కొత్త చర్చ కలకలం.. గులాబీ పార్టీని నడిపించేదెవరు..?