GHMC Delimitation: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) డివిజన్ల డీలిమిటేషన్ వ్యవహారం.. హైకోర్టు వేదికగా కీలక మలుపు తిరిగింది. ఈ అంశంపై దాఖలైన పలు పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు పూర్తవడంతో, న్యాయస్థానం తీర్పు కోసం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రభాకర్ వాదనలు వినిపించారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనలో జనాభా, భౌగోళిక సరిహద్దులను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని ఆయన కోర్టుకు వివరించారు. ఒక డివిజన్లో అధిక జనాభా ఉండగా, మరొక డివిజన్లో తక్కువ జనాభా ఉండడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని వాదించారు. సమాన ప్రతినిధిత్వం కల్పించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, డీలిమిటేషన్ ప్రక్రియలో ఆ సూత్రాన్ని విస్మరించారని ఆరోపించారు.
డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన పూర్తి సమాచారం.. ప్రజలకు అందుబాటులో ఉంచలేదని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. డీలిమిటేషన్కు సంబంధించి కీలకమైన మ్యాప్ను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. అంతేకాదు, ప్రతి డివిజన్కు సంబంధించిన జనాభా గణాంకాలను సైతం బహిర్గతం చేయలేదని, ప్రజలకు సమాచారం లేకుండా అభ్యంతరాలు ఎలా వ్యక్తం చేయగలరని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలంటే ముందుగా ప్రజలకు పూర్తి వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని వాదించారు. అనుమానాస్పదంగా జరిగిన ప్రక్రియపై న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో జీహెచ్ఎంసీ తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. డీలిమిటేషన్ ప్రక్రియ రాత్రికి రాత్రి చేపట్టినది కాదని, ఎంతో ముందస్తు ప్రణాళికతో, విస్తృత గ్రౌండ్ వర్క్ చేసి నోటిఫికేషన్ జారీ చేశామని ఆయన వివరించారు. పరిపాలన సజావుగా సాగేందుకే జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలను విలీనం చేశామని తెలిపారు.
గ్రామపంచాయతీలను మున్సిపాలిటీల్లో కలిపిన తర్వాత వాటికి వార్డు నెంబర్లు కేటాయించడం తప్పనిసరి అయిందని ఏజీ చెప్పారు. ఈ ప్రక్రియలో నియోజకవర్గాల సరిహద్దులు మారకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే డివిజన్ల పునర్విభజన జరిగిందని స్పష్టం చేశారు. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చారు.
డీలిమిటేషన్ మ్యాప్ను హైకోర్టుకు సమర్పించిన ఏజీ, అవసరమైన వివరాలు న్యాయస్థానానికి అందించామని తెలిపారు. అయితే, ఈ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోకూడదన్నది తమ అభిప్రాయమని, డీలిమిటేషన్ అనేది పూర్తిగా పరిపాలనా పరిధిలోకి వచ్చే అంశమని వాదించారు.
అయితే హైకోర్టు ప్రభుత్వాన్ని పలు కీలక ప్రశ్నలు సంధించింది. డీలిమిటేషన్ మ్యాప్, జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచడంలో అభ్యంతరం ఏమిటని ప్రశ్నించింది. అవి బహిరంగంగా లేకపోతే ప్రజలు తమ అభ్యంతరాలను ఎలా తెలియజేస్తారని నిలదీసింది. మ్యాప్ను ప్రజలకు అందుబాటులో ఉంచడం వల్ల ప్రభుత్వానికి ఏ నష్టం వస్తుందో వివరించాలని ఏజీని కోరింది.
దీనిపై పిటిషనర్ల న్యాయవాది స్పందిస్తూ, డీలిమిటేషన్ ప్రక్రియలో అనుమానాలు ఉన్నప్పుడు జ్యుడిషియల్ రివ్యూ తప్పనిసరిగా ఉండాలని వాదించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత అత్యంత ముఖ్యమని, అదే లేకపోతే న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సహజమని పేర్కొన్నారు.
ఇరుపక్షాల వాదనలు ముగియడంతో, హైకోర్టు తీర్పు కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈ తీర్పు జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన భవితవ్యాన్ని నిర్ణయించడమే కాకుండా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరికాసేపట్లో వెలువడనున్న తీర్పు ఏ దిశగా ఉంటుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.