GHMC News Today(Hyderabad News): ఏటా జరిగేది మళ్లీ రిపీటైంది. అవే మ్యాన్ హోల్స్.. అవే మరణాలు.. అవే సమాధానాలు.. అంతేతప్ప.. పాఠాలు.. గుణపాఠాలు.. నేర్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. గ్లోబల్ సిటీ అంటూ ఊదరగొట్టే ప్రచారం తప్ప.. భాగ్యనగరంలో గ్రౌండ్ లెవల్ పరిస్థితుల్ని అధికారులు పట్టించుకోవడం లేదు. చినుకు పడితే.. నగర రహదారులు.. నరకానికి హైవేగా మారిపోతున్నాయి. మోకాళ్ల లోతు నీళ్లు.. ఆ నీళ్లలో కనిపించని మ్యాన్హోల్స్తో.. నగరవాసులు బయటకు అడుగు వేయాలంటేనే వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
తాజాగా కళాసిగూడలో మౌనిక అనే నాలుగేళ్ల చిన్నారిని మ్యాన్ హోల్ మింగేసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. చిన్నారిని మింగేసిన మ్యాన్ హోల్ చుట్టూ ఇప్పుడు బారికేడ్స్ ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ సిబ్బంది. అదేదో ముందుగానే స్పందించి ఆ మ్యాన్ హోల్ చుట్టూ బారీకేడ్స్ పెడితే.. మౌనిక ప్రాణాలు దక్కేవి. మరోవైపు ఈ నేరం మాది కాదు అన్నట్లు.. మేయర్ మాట్లాడుతున్నారు. రోడ్డు కోతకు గురైందని.. అసలు అక్కడ మ్యాన్ హోలే లేదని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో జరిగే పనులతో మేయర్కు సంబంధం ఉండదా..? సదరు పనులకు జీహెచ్ఎంసీ ఆమోదం ఉండదా..? మరి చిన్నారి ప్రాణాలకు బాధ్యత వహించాల్సింది ఎవరు..? ఇంకెంతమంది బలైతే.. బల్దియాలో మార్పు వస్తుంది..?
జీహెచ్ఎంసీ పరిధిలో 12 వందల 95 కిలో మీటర్ల మేర వరదనీటి కాల్వలు ఉన్నాయి. వీటిపై 3 లక్షల 70 వేలకుపైగా మ్యాన్ హోల్స్ ఉన్నాయి. రోడ్డుపై పడే ప్రతి చినుకు వీటి గుండా వెళ్లాల్సి ఉంది. అయితే బల్దియా అధికారులు మ్యాన్హోల్స్ మెయింటెనెన్స్ పట్టించుకోకపోవడంతో వరద నీరు రోడ్లపైనే నిలుస్తోంది. పూర్తిగా ధ్వంసమైన వాటిని కూడా రిపేర్ చేయడం లేదు. మూతలు విరిగిపోయిన చోట కొత్తవి ఏర్పాటు చేయడం లేదు. తరచూ ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకోకపోవడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని స్కూళ్లు, బస్టాపుల సమీపంలోని మ్యాన్ హోల్స్ డేంజరస్గా మారాయి. కొన్నిచోట్ల మూతలు విరిగిపోయి ఉండగా.. మరికొన్నిచోట్ల అసలు మూతలే లేవు.
ఇక వర్షం కురిసిన ప్రతిసారి కొన్నిచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వర్షపు నీరు పైపులైన్ల ద్వారా సాఫీగా వెళ్లకపోవడంతోనే ఈ సమస్య ఉంటోంది. లక్డీకాపూల్, టోలిచౌకి, రాజ్భవన్ రోడ్డు, ఖైరతాబాద్, నల్లకుంట, ఎల్బీనగర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్కు ఇదే ప్రధాన కారణం. దాదాపు 50 వేల వరదనీటి మ్యాన్ హోళ్లు ఉన్నా ఉపయోగపడడం లేదు. మూతలు విరిగిపోయి, కొన్నిచోట్ల మూతలపై ఉన్న హోళ్లు బ్లాక్ అయ్యి నీళ్లు వెళ్లేందుకు వీలు ఉండడం లేదు. ఇలాంటి మ్యాన్ హోల్స్ని బల్దియా నిర్లక్ష్యం చేస్తోంది. దీంతో ఇవి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోతున్నాయి. మౌనికలాంటి చిన్నారులను బలిగొంటున్నాయి.
వానాకాలానికి ముందు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. అంటే వర్షకాలం వస్తేనే బల్దియాకు మ్యాన్ హోల్స్ గుర్తుకొస్తాయి. అప్పటిదాకా వాటిని పట్టించుకోరన్నమాట. మారిన వాతావరణ పరిస్థితుల్లో.. నడివేసవిలో కూడా నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మ్యాన్ హోల్స్ పరిస్థితి ఏంటి..? బల్దియా అధికారులు చెప్పినట్లు వానాకాలం వచ్చిందాకా ఆగాల్సిందేనా..? అప్పటివరకు వీటి గురించి పట్టించుకునే నాథులే ఉండరా..? ఈ ప్రశ్నలకు బల్దియా ఏం సమాధానం చెబుతుంది..?