GHMC: దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా కొనసాగిన (GHMC)జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించినా, మూడు కార్పొరేషన్లలో ఆఫీసర్ల కొరత కొనసాగుతుంది. ముఖ్యంగా మూడు కార్పొరేషన్లలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న జీహెచ్ఎంసీలో ఈ సమస్య చాలా తీవ్రంగా కన్పిస్తుంది. మూడు కార్పొరేషన్ల విభజనలో భాగంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తించే సుమారు 700 మంది వివిధ క్యాటిగిరీల అధికారులు, సిబ్బందిలో అదనంగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ఇప్పటి వరకు 603 మంది అధికారులు, ఇతర సిబ్బందిని కేటాయించటంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాల చాంబర్లలో అధికారులు సిబ్బంది లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేయటంతో పాటు అదనంగా ఏర్పడిన రెండు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు జీహెచ్ఎంసీకి స్పెషలాఫీసర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే అధికారులు బాధ్యతలు స్వీకరించారు. కానీ వారు ఆశించిన స్థాయిలో విధులు నిర్వర్తించేందుకు వీలుగా కింది స్థాయి సిబ్బంది అందుబాటులో లేదు. ముఖ్యంగా మూడుగా విభజించిన తర్వాత జీహెచ్ఎంసీలో ఖాళీ అయిన పలు విభాగాలకు అదనపు కమిషనర్లను నియమించేందుకు అధికారులు లేకపోవటంతో రాత్రికి రాత్రే అధికారులు పలువురు జోనల్ కమిషనర్లకు ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలకు అదనపు కమిషనర్లుగా బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం.కొందరు అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు రెండు నుంచి మూడు రకాల బాధ్యతలను అప్పగించటంతో అధికారులు బేజారవుతున్నట్లు సమాచారం.
Also Read: GHMC: జీహెచ్ఎంసీ చివరి రోజు.. భారీగా శంకుస్థాపనల జోరు..?
అదనపు విధుల నిర్వహణ కారణంగా ఆఫీసర్లు ఎపుడు ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. జీహెచ్ఎంసీ తరహాలోనే సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లలో సేవలందించేందుకు విభాగాల వారీగా నియమించేందుకు ఆఫీసర్లు లేకపోవటంతో సర్కారు వివిధ విభాగాల్లో అధికారుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.ముఖ్యంగా జీహెచ్ఎంసీలోని ఫైనాన్స్, రెవెన్యూ, ఐటీ విభాగాలకు అదనపు కమిషనర్ గా వ్యవహారిస్తున్న అనురాగ్ జయంతి రాజేంద్రనగర్ జోన్ కు జోనల్ కమిషనర్ గా కూడా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రియాంక ఆల కు హెల్త్ విభాగం అదనపు కమిషనర్ గా, సికిందరాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ కు అతి ముఖ్యమైన శానిటేషన్ విభాగం అదనపు కమిషనర్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు. దీంతో పాటు ఇటీవలే రెవెన్యూ శాఖల నుంచి గోల్కొండ జోన్ జోనల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ముకుంద రెడ్డిని సైతం ప్రధాన కార్యాలయంలోని ఎలక్షన్ వింగ్ కు అదనపు కమిషనర్ బాధ్యతలను అదనంగా అప్పగించారు.
వీరిలో ఎలక్షన్ వింగ్ కు అదనపు కమిషనర్ గా బాధ్యతలను నిర్వర్తించేందుకు ముకుంద రెడ్డి విముఖతను వ్యక్తం చేయటంతో ఆ బాధ్యతలను శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళకు అప్పగించినట్లు తెలిసింది. ఇక నిన్న మొన్నటి వరకు జీహెచ్ఎంసీలోని అర్బన్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ (యూసీడీ) వింగ్ కు అదనపు కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఎన్. పంకజను సర్కారు జలమండలి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నియమించటంతో ఆమె బాధ్యతలను అదనపు కమిషనర్ మంగతాయారకు అప్పగించారు. కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణకు అదనంగా అదనపు కమిషనర్ అడ్మిన్ బాధ్యతలను అప్పగించారు. ఇక అర్బన్ బయోడైవర్శిటీ (యూబీడీ) విభాగానికి అదనపు కమిషనర్ గా విధులు నిర్వహించిన సుభద్రాదేవి అదనపు కమిషనర్ (యూబీడీ)గా సైబరాబాద్ కార్పొరేషన్ కు వెళ్లటంతో ఆమె స్థానంలో యూబీడీ డైరెక్టర్ వెంకటేశ్వరరావుకు అదనపు కమిషనర్ బాధ్యతలను కేటాయించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీకి ఉన్న ఆస్తుల నుంచి అద్దెలను వసూలు చేయటంతో పాటు ఆస్తు పరిరక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న ఎస్టేట్ విభాగాన్ని రెవెన్యూ వింగ్ లో విలీనం చేశారు. ఎస్టేట్ విభాగంలోని అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్లు కేవలం అద్దెలు వసూలు చేసి బల్దియా ఖజానాలో డిపాజిట్ చేయటంతో పాటు లీజులు, అద్దె అగ్రిమెంట్ల ముగిసిన ఆస్తులకు మళ్లీ ఆక్షన్ నిర్వహించి, కేటాయింపులు జరిపే విధులు నిర్వర్తించే వారు. కొంత కాలం క్రితం ఆస్తులను అద్దెకిచ్చేందుకు ఆక్షన్ నిర్వహించే బాధ్యతలను ఎక్కడికక్కడే సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లకు అప్పగించారు. దీంతో ఎస్టేట్ సిబ్బందికి విధులు తగ్గిపోయాయి. ఎలాగో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కోసం నియమించుకున్న ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకే అద్దెల వసూళ్ల బాధ్యతలను అప్పగించి, ఎస్టేట్ విభాగం అధికారులు, సిబ్బందికి ఇతర విధులను కేటాయించాలని కమిషనర్ కర్ణన్ భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Municipal Results 2026: సంబురాలకు సిద్ధమైన కాంగ్రెస్.. మున్సిపాలిటీల్లో గెలుపు ధీమా!