GHMC: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు పౌర, అత్యవసర సేవలందించే దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ( Ghmc) తీసుకునే ప్రతి నిర్ణయంలో కీలక పాత్ర పోషించే స్టాండింగ్ కమిటీ ఈ నెల 9న మరోసారి సమావేశం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ ఈ నెల 10వ తేదీ నాటికి ప్రస్తుతమున్న పాలక మండలి అయిదేళ్ల అధికార గడువు ముగియనుండటంతో, గడువుకు ఒక రోజు ముందు మరోసారి స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే పలు సార్లు నిర్వహించిన స్టాండింగ్ కమిటీల్లో పలు అభివృద్ది ప్రతిపాదనలు, సీఎస్ఆర్ కింద పలు ట్రాఫిక్ ఐలాండ్ లు, పార్కుల మెయింటనెన్స్ వంటి ఇతర ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమిటీ పదవీ కాలం ముగింపునకు ఒక రోజు ముందు స్టాండింగ్ కమిటీ నిర్వహించి ఆమోదించగల్గిన పెద్ద ప్రతిపాదనలేమీ లేకపోయినా, కేవలం ఆర్థిక లావాదేవీల కోసం, పలు ఆస్తుల లీజు ప్రతిపాదనలను టేబుల్ ఐటమ్స్ గా కమిటీ ముందు ప్రవేశపెట్టి ఆమోదించేందుకు మాత్రమే ఈ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీలో ఏకంగా 41 ప్రతిపాదనలకు, మరో రెండు టేబుల్ ఐటమ్స్ కు కూడా ఆమోదం తెలిపిన సంగతి తెల్సిందే.
Also Read: BRS Party: గులాబీ అధిష్టానం బిగ్ టాస్క్.. మున్సిపాలిటీ గెలుపు బాధ్యత మాజీ మంత్రులదే!
అంతకు ముందు నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో అధికారులు, వివిధ విభాగాధిపతులు పలు ప్రతిపాదనలను టేబుల్ ఐటమ్స్ గా పెట్టడంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేయటంతో వాయిదా పడ్డ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదనలను ఆ తర్వాత మరోసారి కమిటీ సమావేశాన్ని నిర్వహించి ఆమోదించుకున్నారు. పదవీ కాలం చివర్లో వీలైనంత మేరకు గొంతెమ్మ కోర్కేలను తీర్చుకునేందుకు పాలక మండలి సిద్దమైనట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 9న జరగనున్న స్టాండింగ్ కమిటీలో కూడా కార్పొరేటర్లకు ఐ ఫోన్లు సమకూర్చుకోవాలన్న ప్రతిపాదనను టేబుల్ ఐటమ్ గా తీసుకుని ఆమోదించుకునేందుకే 9న మరోసారి స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్దమైనట్లు సమాచారం.
గత నెలలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్పొరేటర్లు అహ్మదాబాద్ తదితర నగరాల్లో స్టడీ టూర్ కు వెళ్లే ప్రతిపాదనను పెట్టి, ఆమోదించుకున్న సంగతి తెల్సిందే. స్టడీ టూర్ పేరిట జల్సాలు చేసిన కార్పొరేటర్లు ఖజానా నుంచి సుమారు రూ. కోటిన్నర దుబారాగా వెచ్చినట్లు కూడా ఆరోపణలున్నాయి. కార్పొరేటర్లు స్టడీ టూర్ క వెళ్లొచ్చి సుమారు నెల రోజులు గడుస్తున్నా, అక్కడ వారు ఏ అంశంపై స్టడీ చేశారు? కొత్తగా ఏ విషయాన్ని గ్రహించారన్న అంశంపై ఇప్పటి వరకు ఒక్క కార్పొరేటర్ కూడా నివేదికలను సమర్పించలేదు.
పాలక మండలి కొలువుదీరినప్పటి నుంచి మొదటి స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ప్రతి బుధవారం నిర్వహించే వారు. ప్రస్తుతమున్న స్టాండింగ్ కమిటీ ప్రతి గురువారం సమావేశం నిర్వహిస్తూ వచ్చింది. కానీ కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా ఈ నెల 9న సోమవారం నిర్వహించనున్న స్టాండింగ్ కమిటీ అజెండాపై పాలక మండలి పెద్దలు, స్టాండింగ్ కమిటీ సభ్యులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అజెండాలో ఏఏ ప్రతిపాదనలను పొందుపర్చాలన్న విషయంపై మేయర్ అధికారులతో సమాలోచనలను చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కొన్ని భూ బదలాయింపులు, లీజుల ఎక్స్ టెన్షన్లకు సంబంధించిన ప్రతిపాదనలతో పాటు కార్పొరేటర్లకు ఐ ఫోన్, కార్పొరేటర్లకు ఆర్థికంగా లబ్ది చేకూర్చే అంశాలనే అజెండాలో పొందుపర్చనున్నట్లు సమాచారం.