![](https://bigtvlive.com/wp-content/uploads/2022/11/trs-mla-big-1.jpg)
Governor tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన ఆరోపణలు చేశారు. మొయినాబాద్ ఫాంహౌజ్ కేసులోకి రాజ్ భవన్ ను లాగాలని చూస్తున్నారని అన్నారు. తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తుషార్ గతంలో తన ఏడీసీ గా పని చేశారని.. ఉద్దేశ్యపూరకంగా తుషార్ పేరును తీసుకొచ్చారని అన్నారు. తుషార్ తనకు ఫోన్ చేసిన మాట వాస్తవమేనని.. ఆ విషయం టీఆర్ఎస్ నేతల ట్విటర్ హ్యాండిల్ లో ఎలా కనిపించిందని ప్రశ్నించారు. అంటే, తన ఫోన్ కాల్స్ ను ఎవరో ట్యాప్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ బిల్లుపైనా గవర్నర్ అనేక విషయాలు చెప్పారు. కొత్తగా రిక్రూట్ మెంట్ బోర్డు ఎందుకనేదే తన ప్రశ్న.. కొత్త బోర్డుతో నియామకాలు ఆలస్యం అవుతాయని అన్నారు. ఏటా నియామకాలు ఉంటాయా? యూజీసీ నిబంధనలకు లోబడే ఉంటాయా? లీగల్ ఇబ్బందులు వస్తే పరిస్థితి ఏంటి? కొత్త బోర్డు ఎందుకు? అనే ప్రశ్నలు సంధించారు తమిళిసై. ఇదే అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ అడిగానని చెప్పారు. అయితే, సంబంధిత మంత్రి మాత్రం తనకు రాజ్ భవన్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పడం హాస్యాపదం అన్నారు గవర్నర్.
స్టూడెంట్స్ జేఏసీలను రాజ్ భవన్ ముందు ఆందోళనలకు కొందరు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. విద్యార్థులు ఎవరైనా ఎప్పుడైనా రాజ్ భవన్ కు రావొచ్చని.. ప్రగతి భవన్ లా ఎలాంటి అడ్డంకులు ఉండవని అన్నారు.
8 ఏళ్లుగా అనేక వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోకుండా.. ఇప్పుడు కొత్త బిల్లు తీసుకొస్తున్నారని అన్నారు. రిక్రూట్ మెంట్ బిల్లుపై ప్రభుత్వాన్ని క్లారిటీ అడిగానని.. తానేదో బిల్లును ఆపుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని గవర్నర్ తప్పుబట్టారు. ప్రభుత్వం నుంచి ఆరు బిల్లులు వచ్చాయని.. వాటిని సమగ్రంగా పరిశీలిస్తున్నానని.. ఒకదాని తర్వాత ఒకటి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇందుకు ఎలాంటి టైమ్ లిమిట్ లేదని స్పష్టం చేశారు.