Gram Panchayat Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. ఎన్నికల నిర్వహణపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలు బట్టి షెడ్యూలు, నోటిఫికేషన్ విడుదలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. మూడు దశల్లో నిర్వహించాలని ఇటీవల ప్రతిపాదన చేసింది. అయితే ఎన్నికలు ఎప్పుడు అనేదానిపై ఈనెల 25న అంటే మంగళవారం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. సోమవారం గ్రామ పంచాయతీల రిజర్వేషన్లపై అన్ని జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.
పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్ధం
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నాలుగు రోజులుగా జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లను ఓకే చేశారు. రిజర్వేషన్లు 50 శాతానికి దాటొద్దని పంచాయతీ రాజ్ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, జనరల్, మహిళలకు కేటాయించిన స్థానాల వివరాలను ప్రకటించారు. గ్రామాలు, వార్డుల వారీగా కేటాయించిన రిజర్వేషన్ల వివరాలు మండల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు.
సోమవారం జిల్లాల కలెక్టర్లు ఆయా జిల్లాల్లో రిజర్వు చేసిన స్థానాలు, జనరల్ కేటగిరీకి సీట్ల జాబితాలను విడుదల చేయనున్నారు. వాటిని రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టరేట్కు పంపిస్తారు. అన్ని జిల్లాల గెజిట్లతో కూడిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్శాఖ అందజేయనుంది.దీనికితోడు రిజర్వేషన్ల గెజిట్ నోటిఫికేషన్లు, ఎన్నికల సన్నద్ధతపై హైకోర్టుకు సమాచారం ఇవ్వనుంది. గ్రామ పంచాయితీల్లో రిజర్వేషన్ల ఓకే కావడంతో అప్పుడే ఎన్నికల కోలాహలం మొదలైంది. తమ మండలంలో సామాజికవర్గాల వారీగా ఎవరికి ఎన్ని స్థానాలు దక్కాయో తెలుసుకునే పనిలో పడ్డారు నేతలు. రిజర్వేషన్ల ద్వారా కలిసొచ్చినవారు పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.
కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు జారీ?
తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ఓటర్ల లెక్క తేలింది. పల్లెటూరులో 1,67,03,173 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 81,65,899 మంది పురుషులు కాగా, 85,36,770 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆ లెక్కన పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కవగా ఉన్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలో వచ్చిన అభ్యంతరాలపై అధికారులు దృష్టి సారించారు. ఆదివారం గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో ఓటరు జాబితాను ప్రదర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 12 వేల 474 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 12 వేల 733 సర్పంచ్ స్థానాలకు, లక్షా 12 వేల 288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేసింది.
ALSO READ: కేటీఆర్ అరెస్టు తప్పదు, మంత్రి అడ్లూరి సంచలన వ్యాఖ్యలు