Highway Impact: స్వేచ్ఛ బ్యూరో: అశ్వారావుపేట ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ హైవే మార్గం మార్పు స్థానిక వ్యాపారాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఒకప్పుడు భారీ వాహనాల రాకపోకలతో కిక్కిరిసిపోయే ఈ ప్రాంతం, ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. రోజంతా ట్రాఫిక్తో కళకళలాడే రహదారులు, ఇప్పుడు ఖాళీగా కనిపిస్తూ వ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.ప్రత్యేకంగా హోటళ్లు, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, ఆటోమొబైల్ షాపులు, మెకానిక్ వర్క్షాప్లు మాత్రమే కాకుండా కొబ్బరి బొండాల షాపులు, ట్రాన్స్పోర్ట్ బిల్లులు తీసే షాపులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభం తర్వాత భారీ వాహనాలు ప్రధాన రహదారిని వదిలి కొత్త మార్గాన్ని ఎంచుకోవడంతో, ఇక్కడి వ్యాపారాలపై ఆధారపడిన కస్టమర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
అదేవిధంగా, ఒకప్పుడు అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్లో కలిసిన కుక్కునూర్, వేలేరుపాడు మండలాలకు వ్యాపార కేంద్రంగా వెలుగొందిన అశ్వారావుపేట—2014కు ముందు ఒక “వ్యాపార రాజధాని”గా పేరుగాంచింది. ఆ ప్రాంతాల ప్రజలు, వ్యాపారులు అన్ని అవసరాల కోసం అశ్వారావుపేటనే ఆశ్రయించేవారు.బట్టల వ్యాపారం, సంతలు, సినిమాలు, ఆటో ప్రయాణాలు, చిరు వ్యాపారాలు, బంగారం వ్యాపారం, తాకట్టు దుకాణాలు, ఆసుపత్రులు—అన్నింటికీ ఇదే ప్రధాన కేంద్రంగా ఉండేది. రాష్ట్ర విభజనతో రెండు మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఆర్థికంగా ఉత్సాహంగా ఉన్న ఈ పట్టణం, ఇప్పుడు క్రమంగా తన పాత వైభవాన్ని కోల్పోతూ దిగజారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: చిప్స్ ప్యాకేట్ల పై కస్టమ్స్ డ్యూటీ.. నేపాల్ ప్రధానీ నిర్ణయం పై ఎగిసిపడుతున్న నిరసనలు!
ఆర్థిక రాజధాని”గా ఉన్న అశ్వారావుపేట, ఇప్పుడు కేవలం “రాజకీయ రాజధాని”గా మిగిలిపోయిందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.ప్రస్తుతం బస్సులు మరియు కొద్దిపాటి చిన్న వాహనాలు తప్ప, ఒకప్పుడు తరలివచ్చే భారీ ట్రక్కులు, లారీలు కనిపించడం దాదాపు ఆగిపోయింది. దీంతో రోడ్డుపక్కన ఆధారపడి నడిచే వ్యాపారాలన్నీ క్షీణత దిశగా వెళ్తున్నాయి. ఇప్పటివరకు ట్రక్ డ్రైవర్లు, ప్రయాణికులు, వాణిజ్య వాహనాలపై ఆధారపడి జీవనం సాగించిన చిన్న వ్యాపారులు ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ ఖర్చులు తీర్చుకోవడమే కష్టంగా మారింది. టీ స్టాళ్లు మరియు ముఖ్యంగా కొబ్బరి బొండాల దుకాణాలు పూర్తిగా ప్రయాణికులపై ఆధారపడి ఉండటంతో అమ్మకాలు దాదాపు నిలిచిపోయాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ బిల్లులు తీసే కంప్యూటర్ షాపులు, లోడింగ్ రసీదులు ఇచ్చే కాంటా సెంటర్లు కూడా వాహనాల రాకపోకలు తగ్గిపోవడంతో పని లేకుండా పోయింది.
నరంవరిగూడెం, అచ్చుతాపురం, మందలపల్లి రహదారి వెంబడి లారీలు, ఆటోలు, కార్లు ఆగి పూల మొక్కలు, మామిడి, జీడిపండ్లు, కొబ్బరి మొక్కలు కొనుగోలు చేసేవి. ఆ వ్యాపారం కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. ముందు రోజుల్లో పరిస్థితి మరింత విషమించవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యాపారాలు పూర్తిగా కుంగిపోయి, అశ్వారావుపేట ఆర్థికంగా మరింత వెనుకబడే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.మొత్తం మీద, గ్రీన్ ఫీల్డ్ హైవే అభివృద్ధి ఒకవైపు వేగవంతమైన ప్రయాణానికి దోహదపడుతున్నప్పటికీ, మరోవైపు అశ్వారావుపేట, దమ్మపేట మండలంలోని కొన్ని ప్రాంతాల్లో చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అభివృద్ధి మరియు జీవనోపాధి మధ్య సమతుల్యత సాధించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read: కేసీఆర్ వారసత్వం వద్దు.. కవిత నయా రాజకీయం వెనుక అసలు ప్లాన్ ఇదే..!