Harish Rao: వరంగల్లో కాకతీయుల నాటి చారిత్రక శివాలయం కూల్చివేత ఘటనపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బడులకు.. గుడులకు దిక్కులేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భగవంతుడంటే భక్తి.. భయం లేవని.. దేవుళ్లపై ఒట్టేసి రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో దేవాలయాలను అభివృద్ధి చేస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని కూలగొడుతోందని ఆయన ధ్వజమెత్తారు.
కాకతీయ గణపతి దేవుడు నిర్మించిన అద్భుతమైన శివాలయాన్ని గుప్తనిధుల కోసమే ఉద్దేశపూర్వకంగా అర్థరాత్రి వేళ కూల్చేశారని హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డికి కూల్చడం కొత్తేమీ కాదని.. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను.. బతుకులను ఇప్పటికే కూల్చేశారని విమర్శించారు. నిజాం కట్టడాల చుట్టూ లంకెబిందెలు ఉన్నాయని గతంలోనే వెతికించారని.. ఇప్పుడు కాకతీయులు ఏలిన ఓరుగల్లుపై పడ్డారని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ తవ్వకాలు జరిగాయని ఆయన బాంబు పేల్చారు.
గర్భగుడి కింద ఏకంగా 24 అడుగుల కందకం తవ్వారంటే అది గుప్తనిధుల కోసం కాక మరేమిటని హరీశ్ రావు ప్రశ్నించారు. ఆ తవ్వకాల్లో ఏం దొరికాయో.. ఏం ఎత్తుకెళ్లారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో శివాలయం భూమిని దేవాదాయ శాఖ భూమిగా నమోదు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ‘భూభారతి’లో దానిని ప్రభుత్వ భూమిగా ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మరో చోటు నుండి ఇక్కడికి మార్చడం వెనుక ఉన్న మర్మమేంటని నిలదీశారు. లంకెబిందెల వేటలో భాగంగానే ఆలయాన్ని కూల్చారని ఆయన స్పష్టం చేశారు.
అధికారులు ఈ వ్యవహారంలో బుకాయిస్తున్నారని.. పురావస్తు శాఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తవ్వకాలకు వాడిన మెషినరీని సీజ్ చేయాలని.. యుద్ధప్రాతిపదికన దేవాలయాన్ని పునరుద్ధరించాలని కోరారు. దేవాలయ స్థలాన్ని తక్షణమే పురావస్తు శాఖకు అప్పగించి.. బయటపడ్డ లంకెబిందెలు.. గుప్తనిధులపై సమగ్ర విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చారిత్రక సంపదను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమన్నారు.
Read Also: తమతో కలిసిరండి.. ప్రధాని పిలుపుపై స్పందించిన సీఎం రేవంత్, ఇంతకీ ఏమన్నారంటే?