Harish Rao: మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై శనివారం గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. క్యాంప్ ఆఫీసులో కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. దీనిపై హరీశ్ రావు స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై సీఎం జరిపించిన దాడిగా దీనిని అభివర్ణించారు.
గజ్వేల్ ఎమ్మెల్యే కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ.. మాజీ మంత్రి హరీశ్ రావు పత్రికా ప్రకటన విడుదల చేశారు. పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్ను తలపిస్తోందని దుయ్యబట్టారు. ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాల పైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై దాడులు, ప్రజా సంఘాలపై దాడులు, మీడియా పై దాడులు.. నిత్యకృత్యం కావడం సిగ్గుచేటని మండిపడ్డారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? అంటూ హరీశ్ రావు నిలదీశారు. పార్టీ కార్యాలయంపై దాడి జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఒకవైపు ‘హేట్ స్పీచ్ బిల్’ పేరుతో ప్రజలు, ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ.. మరోవైపు గూండాలతో దాడులు చేయించడమేనా మీ ప్రజా పాలన? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అని చెబుతూ… గూండా రాజ్యం అమలు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ పాలనను గాలికి వదిలేశారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఇక్కడ పాలనను ఎవరు చూస్తారని నిలదీశారు. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయాలని సందేశాలు ఇచ్చారా? కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా?’ అని హరీశ్ రావు క్వశ్చన్ చేశారు. ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి.. ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు.
Also Read: ఘోరంగా ఓడినా.. సైకోకు బుద్ధి రాలేదు.. జగన్పై విరుచుకుపడ్డ మంత్రి
కాంగ్రెస్ పార్టీ అణిచివేత, బెదిరింపు ధోరణికి బీఆర్ఎస్ ఏమాత్రం అదరదని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ నేతలను అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని, ప్రజల తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడులు జరిపిన కాంగ్రెస్ గూండాలను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఆపకపోతే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
Also Read: టార్గెట్ టీటీడీ ఛైర్మన్.. ఉచ్చుబిగుస్తున్న వైసీపీ.. ఇరకాటంలో టీడీపీ!