BRS vs Congress: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేయడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. బుధవారం వెలువడిన స్పీకర్ తీర్పుపై స్పందిస్తూ.. రాహుల్ గాంధీ నిత్యం వల్లించే “సేవ్ ది కానిస్టిట్యూషన్” (రాజ్యాంగ రక్షణ) నినాదం ఎంత బూటకమో నేడు పూర్తిగా బహిర్గతమైందని ఎద్దేవా చేశారు.
రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను దిగజార్చడం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. యాంటీ-డిఫెక్షన్ చట్టం ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా, నిబంధనలను పక్కనపెట్టి అధికార పార్టీకి అనుకూలంగా తీర్పునివ్వడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీలో రాజ్యాంగ నైతికతపై ఉపన్యాసాలు ఇస్తూ, తెలంగాణలో మాత్రం అదే రాజ్యాంగాన్ని కాంగ్రెస్, రాహుల్ గాంధీలు ధిక్కరిస్తున్నారని విమర్శించారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. స్పీకర్ తీర్పును తప్పుబట్టారు. రూల్ బుక్ ప్రకారం పిటిషనర్లకు ఆర్డర్ కాపీ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదని ఆరోపించారు. అసలు ఈ ఆర్డర్ కాపీ అసెంబ్లీలో తయారు కాలేదని, జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తయారు చేసి పంపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం రాజ్యాంగం పుస్తకం పట్టుకుని తిరిగిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని పరిహసిస్తున్నారని మండిపడ్డారు.
ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా తూతూమంత్రంగా వ్యవహరించారని, పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉంటే కేవలం ఐదుగురి పిటిషన్లపైనే తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ వంటి వారికి నోటీసులు ఇచ్చినా స్పందించలేదని, వారిని వెంటనే అనర్హులుగా ప్రకటించాల్సింది పోయి కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. స్పీకర్ తీర్పుపై కచ్చితంగా హైకోర్టుకు వెళ్తామని, న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.
Read Also: TG Mlas Defection: ఆ ఎమ్మెల్యేలు సేఫ్.. అనర్హత పిటిషన్లు కొట్టివేత, స్పీకర్ కీలక నిర్ణయం