Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మైనింగ్ మరియు భూ కుంభకోణాల చుట్టూ ముదిరిన వివాదం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్కు పాల్పడిందని, ఈ విషయాన్ని గతంలో స్వయంగా రేవంత్ రెడ్డే అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఆ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ధ్వజమెత్తారు.
అక్రమ మైనింగ్ అంశంపై అసెంబ్లీలో చర్చకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని హరీష్ రావు ఆరోపించారు. మంత్రి పొంగులేటిని కాపాడటానికే సీబీ-సీఐడీ (CB-CID) విచారణ వేశారని, అది ముఖ్యమంత్రి జేబు సంస్థ అని ఆయన విమర్శించారు. ఓబుళాపురం మైనింగ్పై హౌస్ కమిటీ వేసినప్పుడు, పొంగులేటి అక్రమ మైనింగ్పై ఎందుకు వేయరు? అని ప్రశ్నించారు. మైనింగ్ శాఖే గతంలో రెండుసార్లు జరిమానా విధించినా, మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. అలాగే, నిబంధనలకు విరుద్ధంగా డీజిల్ జనరేటర్ల అనుమతులు ఇవ్వడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటికి మధ్య భూముల సెటిల్మెంట్లలో భారీ వాటాలు ఉన్నాయని హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న కోటి ఎకరాల భూములను సెటిల్మెంట్ల ద్వారా క్లియర్ చేస్తున్నారని, రాజేంద్ర నగర్ మానస హిల్స్ వివాదంలో వందల కోట్లు కొల్లగొట్టారని పేర్కొన్నారు. కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకాలతో పాటు మూసీ సుందరీకరణ టెండర్లను కూడా పొంగులేటికే ఇస్తున్నారని, వీరిద్దరి మధ్య ఉన్నది విడదీయలేని ఫెవికల్ బంధం అని ఎద్దేవా చేశారు.
దళితుల పట్ల రేవంత్ రెడ్డిది కపట ప్రేమ అని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఎథిక్స్ కమిటీని వాడుకుంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో దళితుల సంక్షేమం కోసం రూ. 7,365 కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని గణాంకాలతో వివరించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేయడం ప్రజాస్వామ్యంపై దాడి అని ఆయన అభివర్ణించారు. తన కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని, రేవంత్ రెడ్డి తన తమ్ముళ్ల కుంభకోణాలపై విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో 20 కుంభకోణాలు జరిగాయని, వీటిపై పోరాటాన్ని బీఆర్ఎస్ వదిలిపెట్టదని హరీష్ రావు స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన పొంగులేటి వెంటనే రాజీనామా చేయాలని లేదా ఆయనను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, శనివారం తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ మైనింగ్పై కీలక ప్రకటన చేశారు. 2014 జూన్ 2 నుంచి గత పదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన అన్ని అక్రమ మైనింగ్ వ్యవహారాలపై సీబీ-సీఐడీ (CB-CID) విచారణకు ఆయన ఆదేశించారు. సిరిసిల్ల ఇసుక మాఫియా, గంగుల కమలాకర్ గ్రానైట్ వ్యాపారాలు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థల అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేశారు.
హరీష్ రావు సోదరుడికి సంబంధించిన గ్రానైట్ వ్యాపారాలు, శ్వేత, గాయత్రి గ్రానైట్ సంస్థల అక్రమాలను విజిలెన్స్ ఇప్పటికే గుర్తించిందని సీఎం పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే పూర్తి నివేదికను సభ ముందుంచుతామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: తెలంగాణ పాలిటిక్స్లో బిగ్ బాంబ్.. 2029 నాటికి రాష్ట్రంలో కొత్త రాజ్యాలు..?