Karimnagar: స్వేచ్ఛ బ్యూరో: ప్రముఖ తత్వవేత్త, ప్రజాకవి బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ జాతీయ స్థాయి ‘ఆధ్యాత్మిక విజ్ఞాన జ్యోతి’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆదివారం కరీంనగర్లోని ఫిలిం భవన్లో జరిగిన కార్యక్రమంలో పలు సంస్థల ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించి ఈ అవార్డును ప్రదానం చేశారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక, తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, శ్రీ విరాట్ విశ్వకర్మ ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. సత్యం గౌడ్ సామాజిక సేవలు, మానవ విలువల పరిరక్షణలో ఆయన కృషిని గుర్తించి ఈ గౌరవం దక్కింది.
కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన డాక్టర్ వంగల శాంతి కృష్ణచార్య, ప్రముఖ నటులు ఆర్.ఎస్. నంద, న్యాయవాది కిరణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ.. సత్యం గౌడ్ ఆధ్యాత్మిక ప్రసంగాలు సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నాయని కొనియాడారు. ఆయనలోని అపార జ్ఞానం, సేవా భావం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సత్యం గౌడ్కు పట్టుశాలువా కప్పి, మెడల్ ధరింపజేసి ఉగాది జ్ఞాపికను అందజేశారు.
Also Read: గుడ్ న్యూస్ చెప్పిన ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ప్రేమ.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!
పురస్కార గ్రహీత డాక్టర్ నాగుల సత్యం గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మనసును అదుపులో ఉంచుకుని నిర్మలమైన జీవితాన్ని గడపాలన్నారు. నేటి యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి నవ సమాజ నిర్మాణానికి పునాదులుగా నిలవాలని పిలుపునిచ్చారు. కళాకారులను, కవులను నిరంతరం ప్రోత్సహిస్తున్న నిర్వాహకులు పోలోజు రాజకుమార్ సేవలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు వలబోజు మోహన్ రావు, బిడ్డల ప్రశాంత్, యాదగిరి గౌడ్ తదితర ప్రముఖులు, కళాకారులు పాల్గొన్నారు.
Also Read: సత్తుపల్లిలో దారుణం.. ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా..!