రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి.. సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల సమస్యలను గాలికి వదిలేసిన పాలకులకు అన్నదాతలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఆదివారం మండల పరిధిలోని మల్లారం స్టేజ్ వద్ద రాజీవ్ రహదారిపై రైతులతో కలిసి హరీష్ రావు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిబంధనల పేరుతో రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు ప్రచారం చేసుకుంటున్నారే తప్ప క్షేత్రస్థాయిలో ఒక్క కిలో వడ్లు కూడా సేకరించలేదని విమర్శించారు.
కేంద్రాలు తెరిచి 28 రోజులు గడిచినా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీష్ రావు తెలిపారు. మొక్కజొన్న పండించిన రైతులకు కనీసం గన్నీ బ్యాగులు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. గత్యంతరం లేక రైతులే తమ సొంత డబ్బులతో సంచులను కొనుగోలు చేసుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. సన్ఫ్లవర్ పంట 22 రోజులుగా కేంద్రాల్లోనే మగ్గుతున్నా అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో మొక్కజొన్న.. శనగలు.. వడ్లు పండించిన ప్రతి రైతు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కన్నీరు తగిలితే ఈ ప్రభుత్వం నిలబడదని ఆయన హెచ్చరించారు.
వెంటనే కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి యుద్ధప్రతిపాదికన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో వడ్లకు బోనస్ ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్.. ఇప్పుడు దాన్ని బోగస్గా మార్చేసిందని ఎద్దేవా చేశారు. ఎరువులు కొనాలంటే యాప్.. వడ్లు అమ్మాలంటే ఆన్లైన్ నమోదు అంటూ రైతులను సాంకేతిక ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదన్నారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిని రోడ్ల మీదకు తీసుకువచ్చిందని ఆగ్రహించారు. రాజీవ్ రహదారిపై నిర్వహించిన రాస్తారోకో కారణంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
సమాచారం అందుకున్న చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ధర్నా నిర్వహిస్తున్న హరీష్ రావుతో చర్చలు జరిపి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన నిరసనను విరమించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కూర మాణిక్యరెడ్డి, జంగిటి శ్రీనివాస్, కీసరి పాపయ్య, రేగుల దేవయ్య, సుంచు ఆంజనేయులు, లంకెల హరీష్, మధుసూదన్ రెడ్డి, ఉమేష్ చంద్ర, కొండం రవీందర్ రెడ్డి సహా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు.. రైతులు పాల్గొన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని.. ధాన్యం కొనే వరకు ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని హరీష్ రావు స్పష్టం చేశారు.
ALSO READ: భానుడి భగభగలకు చెక్.. రెండ్రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో పిడుగుల వాన..!