రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. కొందరికి పాలిటిక్స్ కలిసొస్తే మరికొందరికి శత్రువులను మిగులుస్తుంటాయి. అయినప్పటికీ పాలిటిక్స్లో ప్రత్యర్థులే ఉంటారు కానీ చిరకాల శత్రువులు, మిత్రువులు అనే వారు చాలా తక్కువ. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా ఘటనలు ప్రూవ్ చేశాయి.దేశరాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు ఇదే ప్రిన్సిపుల్ను కొందరు ఇప్పటికీ వాడుతుంటారు.అధికారం, కుర్చీ కోసం మన పైన ఉన్నవారికి దెబ్బకొట్టేందుకు ప్రయత్నించడం, పార్టీలు మారడం రాజకీయాల్లో చాలా కామన్. అవకాశం అనేది చాలా అరుదు. అందుకే నేతలు దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటుంటారు. మన వెన్నంటే ఉన్నట్టు ఉంటారు. కానీ చివరిక్షణంలో దెబ్బకొడుతుంటారు.గ్రామ స్థాయి నుంచి రాష్ట్రాస్థాయిలోనూ ఇదే అసలు సిసలైన రాజకీయ తంత్రం అని తలపండిన రాజకీయ నేతలు చెబుతుంటారు.
రాజీకీయం అంటే మోసం చేయడం, దెబ్బకొట్టడం, అధికారం కోసం అర్రులు చాచడం అని నేటితరం పొలిటిషన్స్కు చాలా బాగా తెలుసు. అందుకే అవకాశవాదులే రాజకీయ నాయకులు అవుతుంటారు. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త ప్రచారం ఊపందుకుంది. ఇన్నిరోజులు మామ కుర్చీకి సూటివెట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మాజీ మంత్రి.. అంతకుముందు బామ్మర్ది కుర్చీ మీద కన్నేసినట్టు టాక్ వినిపించింది.ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.ముందు బామ్మర్దిని తప్పించి ఆ తర్వాత మామ కుర్చీని దక్కించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిన్న సీఎం ఆరోపించారు.
సీఎం ఆరోపించిన వ్యక్తి మరెవరో కాదు సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇటీవల ఆధిపత్య పోరులో భాగంగానే పార్టీ నుంచి కవితను బయటకు పంపించడంలో హరీశ్ రావు సక్సెస్ అయ్యారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి పార్టీ అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోతూ వస్తున్నది. గతంలో హరీశ్ రావుకు ట్రబుల్ షూటర్ అనిపేరుంది. ఆయన ఏ ఎన్నికలు డీల్ చేసినా గెలిపించారని పేరుంది. అయితే, అధికారంలో ఉన్నప్పుడు పార్టీని ఎవరైనా గెలిపిస్తారు. పవర్ లేనప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించిన కేటీఆర్ వరుస పరాభావాలను ముటగట్టుకున్నారు. ఇదే విషయాన్ని హరీశ్ రావు తన సొంత వర్గం ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు.
కేటీఆర్ను పార్టీలో డల్ చేసి ఆయన కుర్చీని లాక్కోవాలని చూస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. పార్టీలో కేటీఆర్ దూకుడు తగ్గితే ఇంకా హరీశ్ రావుకు తిరుగుఉండదని, ఆ తర్వాత మెల్లిగా ఎలాగోలా తన మామ కుర్చీని సైతం దక్కించుకుని పార్టీలో కింగ్ మేకర్ అవ్వాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది అధికార పార్టీ నేతలు హరీశ్ రావు తన మామకు వెన్నుపోటు పొడుస్తారని ఆరోపించారు. కవిత సైతం అన్నా జాగ్రత్త..అని తన సోదరుడికి ఆ మధ్య హెచ్చరికలు పంపింది.అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ హరీశ్ రావు చెప్పుచేతల్లోకి వెళ్లిపోవడం ఖాయమని కొందరు అంటున్నారు. ఇదిలాఉండగా, సీఎం ఆరోపణలపై హరీశ్ రావు నిన్న ఘాటుగా స్పందించారు. తన చివరి శ్వాస వరకు గులాబీ జెండాను వీడబోనని.. వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వమే అని.. సీఎంగా మళ్లీ కేసీఆర్ ఉంటారని స్పందించడం గమనార్హం.