ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాలపై సిట్ (SIT) విచారణకు హాజరైన అనంతరం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బామ్మర్ది అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి విచారణల పేరుతో ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని మండిపడ్డారు.
సిట్ అధికారులు అడిగిందే అడుగుతూ కాలయాపన చేశారని, ఈ నోటీసులన్నీ నిరాధారమైనవని హరీష్ రావు కొట్టిపారేశారు. ‘నేను హోంమంత్రిని కాదు, ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం? అధికారులు గంటకోసారి బయటకు వెళ్లి ఫోన్లు మాట్లాడి వచ్చి మళ్ళీ అదే ప్రశ్నలు అడిగారు. రేవంత్ రెడ్డి తన బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయటపడటంతోనే సాయంత్రానికల్లా నాకు నోటీసులు పంపారు’ అని ఆయన ఆరోపించారు. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిలను ఎందుకు విచారించడం లేదని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ నాయకత్వంలో వందలాది కేసులు ఎదుర్కొని రాటుదేలిన సైనికులం అని, కాంగ్రెస్ నాయకుల్లా నోటీసులు రాగానే పారిపోయే రకం కాదని హరీష్ రావు స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతుబంధు, పెన్షన్ల వంటి ప్రజా సమస్యలను పక్కన పెట్టడానికే ప్రభుత్వం ఇలాంటి అక్రమ కేసులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ‘ఖమ్మం వరద బాధితులను పరామర్శించినా, ఎగవేతల గురించి ప్రశ్నించినా నాపై కేసులు పెడుతున్నారు. మీరిచ్చే నోటీసులను నేను ప్రజా పోరాటంలో లభించిన గౌరవంగా భావిస్తాను’ అని అన్నారు.
సింగరేణి బొగ్గు టెండర్లలో రేవంత్ రెడ్డి బామ్మర్ది పాత్రపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దమ్ముంటే విచారణ మొత్తం రికార్డింగ్ను బయటపెట్టాలని సవాల్ విసిరారు. ‘పోలీసుల వెనుక దాక్కుని నోటీసులు పంపడం కాదు, రాజకీయంగా ఎదుర్కో. ఎన్ని కుట్రలు చేసినా నా గొంతు సింహంలా గర్జిస్తూనే ఉంటుంది. రెండేళ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, అప్పుడు మీ బామ్మర్ది చేసిన కుంభకోణాలన్నీ కక్కిస్తాం’ అని హెచ్చరించారు.
చివరగా.. చట్టంపై గౌరవం ఉందని, అందుకే విచారణకు హాజరయ్యానని తెలుపుతూ.. ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డికి త్వరలోనే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హరీష్ రావు పేర్కొన్నారు.
ALSO READ: Mahesh Kumar Goud: కేటీఆర్కు లొట్టపీసు తప్ప ఏమీ తెలియదు.. పీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు!