సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు, ఆయన ఉపయోగిస్తున్న భాషపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తన వికృత మాటలతో తెలంగాణ రాజకీయ గౌరవాన్ని దిగజారుస్తున్నారని, ఆయన చరిత్రలో ఒక ‘బూతుల ముఖ్యమంత్రి’గా మిగిలిపోతారని విమర్శించారు.
కేసీఆర్ పేరు వింటేనే కడుపునొప్పి ఎందుకు?
తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ను ప్రజలు ఆత్మీయంగా జాతిపిత అని పిలుచుకుంటే రేవంత్ రెడ్డికి ఎందుకు కడుపునొప్పి అని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి విషం కక్కుతున్నారని, నీతి లేకుండా జాతి గురించి మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. పగ, ప్రతీకారాలతో పరిపాలనను గాలికొదిలేసిన రేవంత్ రెడ్డి, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ భాషపై, అరాచకాలపై తెలంగాణ మేధావులు స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు.
అభివృద్ధి శూన్యం.. అవినీతి అపారం..
పాలన చేతకాక రేవంత్ రెడ్డి నిరాశ నిస్పృహల్లో ఉన్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ‘గ్యారెంటీలు నిల్.. స్కామ్లు ఫుల్’ అంటూ ప్రస్తుత ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లలో ఎస్ఎల్ బిసి (SLBC) టన్నెల్ను 11 కిలోమీటర్ల మేర తవ్వగా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో కనీసం వంద మీటర్లు కూడా తవ్వలేకపోయిందని విమర్శించారు. కనీసం శవాలను బయటకు తీసుకురాలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని ఘాటుగా వ్యాఖ్యానించారు. నెలకు ఒక కుంభకోణానికి పాల్పడుతూ తెలంగాణను అవినీతిమయం చేస్తున్నారని దుయ్యబట్టారు.
బీజేపీతో చీకటి ఒప్పందం..?
సీఎం రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడానికి బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని హరీష్ రావు సంచలన ఆరోపణ చేశారు. అందులో భాగంగానే మహబూబ్ నగర్ ఎంపీ సీటును బీజేపీకి బహుమానంగా ఇచ్చారని విమర్శించారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి రేవంత్ పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో ఖాతా తెరవలేదని, ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ వ్యవహరిస్తున్న తీరు విడ్డూరంగా ఉందన్నారు.
హార్వర్డ్ వెళ్లినా మార్పు రాలేదు..
‘హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి వచ్చావు.. ఇకనైనా మారు’ అంటూ ముఖ్యమంత్రికి హరీష్ రావు హితవు పలికారు. కానీ ఆయన మారతారన్న నమ్మకం తనకు లేదని స్పష్టం చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక వేదికపై హేట్ స్పీచ్ (విద్వేషపూరిత ప్రసంగాలు) గురించి ఉపన్యాసం ఇస్తుంటే, అదే వేదికపై రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్కు లైవ్ డెమో ఇచ్చారని ఎద్దేవా చేశారు. 25 వేల కోట్ల వడ్డీ లేని రుణాల విషయంలో తాను సవాల్ విసురుతున్నానని.. దీనిపై ప్రెస్ క్లబ్లో చర్చకు రావాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కొడంగల్ ప్రజలు తమ నాయకుడి తీరును గమనిస్తున్నారని, ప్రజలే త్వరలో ఆయనకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.