Jangaon Municipality: వరంగల్ బ్యూరో, జనగామ స్వేచ్ఛ: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జనగామ మున్సిపాలిటీ నిధులు దుర్వినియోగం అయ్యాయని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి యాసారపు కరుణాకర్ వెల్లడించారు. ఈ అక్రమాలకు సంబంధించిన దందాపై ఆర్టీఐ (RTI) లో సమాచారం సేకరించి వెల్లడిస్తున్నట్లుగా తెలిపారు. మున్సిపాలిటీ చైర్మన్ లు.. ఎంపీ రికార్డులు, ప్రొసీడింగ్, బిల్లులు లేకుండానే డీజిల్, బ్లీచింగ్ పౌడర్, స్టేషనరీ, విద్యుత్ పరికరాలు కొనుగోళ్ల పేరుతో మున్సిపాలిటీ నిధులను విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
ఇళ్ల నుంచి చెత్త సేకరించే ట్రాక్టర్ల డీజిల్ బిల్లుల విషయంలోనూ అవకతవలు ఉన్నట్లు యాసారపు కరుణాకర్ ఆరోపించారు. పోకల జమున ఛైర్మన్ గా ఉన్న సమయంలో రూ.4 కోట్ల 38 లక్షలు స్వాహ చేసినట్లుగా తెలిసిందన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించే బిల్లుల విషయంలో రూ.2 కోట్ల 70 లక్షలు (ప్రేమలతా రెడ్డి హయాంలో), రూ.5.80 కోట్లు (పోకల జమున హయాంలో) దుర్వినియోగం చేశారని వివరించారు. న్యూస్ పేపర్లలో వేసే అడ్వర్టైజ్మెంట్ విషయంలోనూ పోకల జమున హయాంలో రూ.10 లక్షలు లెక్కలు లేకుండా ఖర్చు చేశారన్నారు. కరెంటు పరికరాల కొనుగోలుకు వస్తే.. ప్రేమలతా రెడ్డి హయాంలో రూ. 62 లక్షలు, పోకల జమున హయాంలో రూ.1.50 కోట్లు దుర్వినియోగం అయ్యాయని కరుణాకర్ ఆరోపించారు.
Also Read: Telangana CEO: ఎస్ఐఆర్కు ముందు.. బీఎల్ఏల నియామకం చేయాలి.. సీఈఓ సుదర్శన్ రెడ్డి
వర్షాకాలంలో నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు వాడే బ్లీచింగ్ పౌడర్, స్టేషనరీ కొనుగోళ్లలో ప్రేమలతా రెడ్డి హయాంలో రూ.34 లక్షలు, పోకల జమున హయాంలో రూ. 15 లక్షలు కాజేశారని యాసారపు కరుణాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే కాకుండా ఉద్యోగుల జీతాల నుండి కొంత మెుత్తం తీసుకొని వారి ఖాతాలలో జమ చేయలేదని తెలిపారు. గత పదేళ్లుగా జనగామ మున్సిపాలిటీని దోచుకుంటూ వచ్చిన బీఆర్ఎస్ కు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని యాసారపు కరుణాకర్ విజ్ఞప్తి చేశారు.
Also Read: YS Sharmila: అమెరికా చేతిలో మోదీ బానిస.. జగన్, బాబు ఏపీని అప్పుల్లోకి నెట్టారు.. వైఎస్ షర్మిల ఫైర్