Medaram Jatara 2026: మేడారం మహా జాతర ముగిసిన అనంతరం.. భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ హనుమకొండలో అత్యంత పారదర్శకంగా సాగుతోంది.
హనుమకొండలోని టిటిడి కళ్యాణ మండపంలో మేడారం జాతర హుండీల లెక్కింపు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర కొండా సురేఖ ఈ లెక్కింపు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర కావడంతో.. భక్తులు తమ మొక్కులను భారీగా చెల్లించుకున్నారు. మొత్తం 828 హుండీలను ఈ కేంద్రానికి తరలించి.. పటిష్టమైన భద్రత నడుమ లెక్కింపు చేపడుతున్నారు.
ఎండోమెంట్ సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు కలిపి మొత్తం 400 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారదర్శకత కోసం లెక్కింపు కేంద్రం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉంది. లెక్కింపు కేంద్రం పరిసరాల్లో పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. అనధికార వ్యక్తులకు ప్రవేశం నిరాకరిస్తూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రారంభమైన మొదటి రోజు అధికారుల బృందం వేగంగా పని చేసి 125 హుండీల లెక్కింపును పూర్తి చేసింది.
మొదటి రోజే దాదాపు రూ. 2,49,65,000 నగదు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. లెక్కించిన నగదును ఎప్పటికప్పుడు దేవాదాయ శాఖ అధికారులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. హుండీలలో కేవలం దేశీయ కరెన్సీ మాత్రమే కాకుండా.. విదేశాలలో ఉంటున్న భక్తులు సమర్పించిన విదేశీ కరెన్సీ కూడా లభ్యమవుతోంది.
మొత్తం 828 హుండీలలో ఇంకా 703 హుండీలు లెక్కించాల్సి ఉంది. ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు రెండు వారాల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతర ఆదాయం గతంతో పోలిస్తే ఈసారి గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Also Read: ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి..? రేపే సుప్రీంలో అసలు సిసలైన విచారణ