CAG Report Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పిందని, రేవంత్ రెడ్డి పాలనలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ధ్వజమెత్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) విడుదల చేసిన నివేదికపై స్పందించారు. కాగ్ నివేదిక రేవంత్ సర్కారుకు చెంపపెట్టు లాంటిదని, బీఆర్ఎస్ మొదటి నుంచి చెబుతున్న విమర్శలనే కాగ్ తన నివేదికలో నిగ్గుతేల్చిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత అవాస్తవికమైనదని, కేవలం అంకెల్లో గారడీ చేస్తూ ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని రెవెన్యూ సర్ ప్లస్ (మిగులు) రాష్ట్రంగా అప్పగిస్తే, కాంగ్రెస్ కేవలం ఏడాది కాలంలోనే దానిని రికార్డు స్థాయి రెవెన్యూ లోటులోకి నెట్టివేసిందని హరీశ్ రావు ఆరోపించారు. 2023-24లో రూ. 779 కోట్లుగా ఉన్న రెవెన్యూ సర్ ప్లస్, 2024-25 నాటికి ఏకంగా రూ. 9,420 కోట్ల డెఫిసిట్ (లోటు)కు చేరుకుందని కాగ్ లెక్కలు చెబుతున్నాయని ఎత్తిచూపారు. కరోనా వంటి విపత్తులు లేకపోయినా, రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తన ఆర్థిక సామర్థ్యంపై గొప్పలు చెప్పుకోవడం ఆపి, రాష్ట్ర పరపతిని దెబ్బతీసే విధానాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు.
రాష్ట్ర సొంత ఆదాయ వనరుల సమీకరణలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని హరీశ్ రావు విమర్శించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం రూ. 14,296 కోట్ల నుండి రూ. 8,473 కోట్లకు పడిపోయిందని, ఇది రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరియు పరిశ్రమలు కుదేలయ్యాయనడానికి నిదర్శనమని అన్నారు. దళిత, గిరిజన మరియు వెనుకబడిన వర్గాల పట్ల ప్రభుత్వానికి ఉన్నది ‘పెదవుల మీద ప్రేమ’ మాత్రమేనని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోందని చెప్పారు. సోషల్ వెల్ఫేర్ కోసం రూ. 25,971 కోట్లు కేటాయించి, కేవలం 37 శాతం (రూ. 9,721 కోట్లు) మాత్రమే ఖర్చు చేయడం అట్టడుగు వర్గాల పట్ల ప్రభుత్వ చిన్నచూపుకు సాక్ష్యమని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం భారీగా అప్పులు తెస్తున్నప్పటికీ, వాటిని రాష్ట్రానికి ఆస్తులుగా (Capital Expenditure) మార్చడంలో విఫలమైందని హరీశ్ రావు దుయ్యబట్టారు. 2024-25లో అప్పులను రూ. 56,209 కోట్లకు పెంచారని, కానీ మూలధన వ్యయం మాత్రం చాలా తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులకు, మిషన్ భగీరథ వంటి పథకాలకు నిధులు ఖర్చు చేయలేదని కాగ్ తప్పుబట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి చెబుతున్న ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనేది ఒక బూటకమని, కేవలం 9 శాతం వృద్ధి రేటుతో అది అసాధ్యమని కాగ్ తేల్చి చెప్పిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రతీకార రాజకీయాలు మాని, పాలనపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోశారు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు